ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ను ముందు వరుసలో చెప్పుకోవచ్చు. దీన్ని మించిన భారీ సిరీస్లు చాలా ఉన్నాయి కానీ.. కంటెంట్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ పరంగా చూస్తే ఇదే నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుంది. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది.
తర్వాత రెండో సీజన్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండో సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేరే కమిట్మెంట్ల వల్ల రాజ్-డీకే కొంచెం గ్యాప్ తీసుకుని.. గత ఏడాది దీని షూట్ మొదలుపెట్టారు. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాదే స్ట్రీమింగ్ కూడా ఉంటుందని టీం క్లారిటీ ఇచ్చింది. ఐతే డేట్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దాని గురించి కూడా క్లారిటీ వచ్చేసింది.
నవంబరు 21 నుంచి అమేజాన్ ప్రైమ్ ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని స్ట్రీమ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థ్రెట్ అండ్ అనాలసిస్ అండ్ సర్వేలెన్స్ సెల్ (టాస్క్) సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్పేయి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఈసారి కథను నార్త్ ఈస్ట్కు తీసుకెళ్లబోతున్నారు.
ఇండియా మీద చైనా సైబర్ ఎటాక్ చేస్తే.. దానికి కౌంటర్గా హీరో అండ్ టీం చేసిందనే కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. ఈసారి ‘ఫ్యామిలీ మ్యాన్’లో కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతోంది. ‘పాతాళ్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందుజా, అభయ్ వర్మ కూడా కొత్తగా సిరీస్లోకి రాబోతున్నారు. ఇక ప్రియమణి, అశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్ లాంటి రెగ్యులర్ ఆర్టిస్టులు ఎలాగూ ఉంటారు. ‘ఫ్యామిలీ మ్యాన్-3’ రాకతో ఇండియన్ వెబ్ సిరీస్ల స్ట్రీమింగ్ రికార్డులన్నీ బద్దలవుతాయని భావిస్తున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లు అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైన సందర్భాలు చూసాం. మరి ఫ్యామిలీ మ్యాన్ 3 ఆ కోవలోకే చేరుతుందా లేదా ప్రేక్షకుల మన్నలను పొందుతుందా అనేది వేచి చూడాలి.