రేపు జనవరికి హనుమాన్ రిలీజై రెండు సంవత్సరాలు నిండుతాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలు కాలేదు. రిషబ్ శెట్టితో జై హనుమాన్ ప్రకటించి నెలలు గడిచిపోయాయి. కానీ రెగ్యులర్ షూట్ ఎప్పుడో తెలియదు. ప్రభాస్ తో ప్లాన్ చేసుకున్న బ్రహ్మ రాక్షస్ నిజంగా ఉంటుందో లేదో క్లారిటీ రావడం లేదు. ఇంకోవైపు తను కథలు ఇచ్చి ఇతరుల డైరెక్షన్లో పర్యవేక్షణ చేస్తున్న సినిమాటిక్ యునివర్స్ మూవీస్ కూడా మెల్లగా సాగుతున్నాయి. అప్పుడప్పుడు మాకాళీ అప్డేట్స్ వస్తున్నాయి. ఓజి టైంలో అధీరా పోస్టర్ వదిలారు. ఇంతకు మించి ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి స్పీడ్ మూమెంట్ లేదు.
ఇంత గ్యాప్ రావడం వెనుక ప్రశాంత్ వర్మ ఎదురుకున్న సమస్యలు రెండున్నాయి. మొదటిది రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బాలీవుడ్ మూవీ హఠాత్తుగా క్యాన్సిల్ కావడం. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనో లేదా హీరో గారి గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోవడం వల్లనో కారణం ఏదైతేనేం ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞని పరిచయం చేసే సినిమా బాధ్యతను బాలకృష్ణ ముందు ప్రశాంత్ వర్మ చేతిలోనే పెట్టారు. చిన్న ఫోటో షూట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అది కూడా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. దీంతో కెరీర్ పరంగా ఒక్కసారిగా రెండు స్పీడ్ బ్రేకర్లు ప్రశాంత్ కు ఇబ్బందిగా మారాయి.
ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ రెండు మూడేళ్ళకో సినిమా చేయడం పట్ల మూవీ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాసరి, రాఘవేంద్రరావులాగా వందల కొద్దీ తీయాలని కోరుకోవడం లేదు కానీ కనీసం సంవత్సరానికి ఒక్కటైనా వస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఈ సమస్య ఒక్క ప్రశాంత్ వర్మదే కాదు. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి ఎందరో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అనుకున్న టైంకి ఏదీ పూర్తి కాకపోవడం పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. కాంతార ప్రమోషన్స్ టైంలో రిషబ్ శెట్టి చెప్పిన ప్రకారం ప్రశాంత్ వర్మ ముందు టేకప్ చేయబోయేది జై హనుమానే.