అగ్గిపుల్ల..సబ్బు బిళ్ల..కుక్క పిల్ల..కాదేదీ కవితకనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ…అయితే, మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, బ్యాగులు…ఇలా కావేవీ ఓటర్లకు పంచేందుకు అనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లును ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి కుక్కర్లు..మరికొందరికి మిక్సీలు..తాయిలాలుగా ఇచ్చి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఇలా గృహోపకరణ వస్తువులతో మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం షాపుల నుంచి దాదాపు 50 వేల మిక్సీలు, కుక్కర్లు కొంటున్నారని సమాచారం. పోలింగ్ కు ముందే పంపిణీ చేసేందుకు వారంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. గోడ గడియారాలు, పిల్లలకు స్కూల్ లంచ్ బ్యాగులు గట్రా కూడా గిఫ్ట్ లుగా ఇచ్చి పిల్లలను బుట్టలో వేస్తున్నారట. ఇక, పురుషులకు డబ్బు, మద్యం బాటిళ్లు, బిర్యానీ ఉండనే ఉన్నాయి. ఇలా, మొత్తం ఫ్యామిలీని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారట.
హోల్సేల్ వ్యాపారులతో డీల్ సెట్ చేసుకొని ఆయా వస్తువులను తరలించే పనిలో ఉన్నారట. డివిజన్ల వారీగా ఛోటామోటా నేతలకు చెందిన గోడౌన్లకు వీటిని తరలించి అక్కడి నుంచి పోలింగ్ కు ఒక రోజు ముందు పంపిణీ చేయాలని ఫిక్సయ్యారట. ఓ వైపు తమ పార్టీ ఇమేజ్, వ్యక్తిగత ఇమేజ్ ను నమ్ముకుంటూనే..ఇలా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కూడా సిద్ధమయ్యారట. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలుపు కోసం కుక్కర్ లలో ఓట్లు ఉడకబెడుతున్న అభ్యర్థులను చూసి …పెద్ద ప్లానే ఇది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ కుక్కర్..లిక్కర్…పాలిటిక్స్ అభ్యర్థులను గెలిపిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. మామూలు కుక్కర్లో పప్పులు ఉడికినట్లు.. జూబ్లీహిల్స్ ‘కుక్కర్’ లో ఓట్లు ఉడుకుతాయా? అన్నది తేలాల్సి ఉంది !