వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఎటునుంచి ఏం ఢీకొంటుందో.. మృత్యువు ఏ వైపు నుంచి దూసుకు వస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంటోంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు.. దక్షిణాదిలో రైలు యాక్సిడెంట్లు కలవరపెడుతున్నాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి ఆరుగురు మహిళలు మృతి చెందారు. నిన్నటి చత్తీస్గడ్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11 కు చేరింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిలాస్పూర్ ప్యాసింజర్ రైలు, గూడ్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మీర్జాపూర్లో కార్తీక పౌర్ణమి వేళ విషాదం చోటు చేసుకుంది. చునార్రైల్వే స్టేషన్లో ఈ ఉదయం రైలు కింద పడి ఆరుగురు భక్తులు మృతి చెందారు. ప్యాసింజర్ రైలులో వచ్చిన భక్తులు స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే ట్రాక్పై వేగంగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. నిన్న బిలాస్పూర్ సమీపంలో లోకల్మెనూ రైలు.. గూడ్సు రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నేడు 11కు చేరింది.
కొద్ది రోజుల కిందట ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తించాయి. కర్నూలు జిల్లాలో గత నెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు, బైక్ నడుపుతున్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన బైకును బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
ఈ ఘటన మరువక ముందే గత సోమవారం తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సును కంకర లోడ్తో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా 34 మందికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనల్లో అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలతో ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో.. అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.