hyderabadupdates.com movies మణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూ

మణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూ

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో మణిరత్నం ఒకరు. నాయకుడు.. ఘర్షణ.. గీతాంజలి.. రోజా.. బొంబాయి.. ఇద్దరు.. దిల్ సే.. సఖి.. యువ.. లాంటి ఎన్నో క్లాసిక్స్‌తో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారాయన. తర్వాతి కాలంలో మణిరత్నం ఫ్లాపులు ఇచ్చారు కానీ.. ఆయన ఔట్ డేట్ అయిన ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ కలగలేదు. కొన్నేళ్ల ముందు ‘పొన్నియన్ సెల్వన్’తో అందరినీ మెప్పించలేకపోయినా.. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

కానీ ‘నాయకన్’ తర్వాత కమల్ హాసన్‌తో మళ్లీ జట్టు కట్టి తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ మాత్రం మణిరత్నం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కెరీర్లో తొలిసారిగా మణి ఔట్ టేడ్ అయిపోయిన ఫీలింగ్ ఈ సినిమా కలిగించింది. పూర్తిగా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక మణిరత్నం సినిమాలు ఆపేస్తే బెటర్ అనే కామెంట్ ఆయన అభిమానుల నుంచే వినిపించింది ఆ టైంలో.

కానీ మణిరత్నం పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే తర్వాతి సినిమాకు రెడీ అయిపోయారు. ఈసారి ఆయన తన మార్కు ప్రేమకథ తీయబోతున్నారట. ‘థగ్ లైఫ్’ రిలీజ్ కాకముందే ఒక లైన్ రెడీ చేసి శింబుతో ఆ సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు మణి. కానీ ఇప్పుడు హీరో మారినట్లు తెలుస్తోంది. శింబు వేరే చిత్రాలతో బిజీ కాగా.. విజయ్ సేతుపతికి కథ చెప్పి ఒప్పించారట మణిరత్నం. ఈ చిత్రంలో కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. 

ప్రేమకథలు తీయడంలో మణిరత్నం మార్కు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా పరిణతితో, హృద్యంగా ఉంటాయి ఆయన లవ్ స్టోరీస్. విజయ్ సేతుపతి, రుక్మిణి.. ఇద్దరూ మంచి పెర్ఫామర్స్ కావడంతో మణిరత్నం తన స్థాయికి తగ్గ ప్రేమకథ తీస్తే ఇది ఒక క్లాసిక్‌గా మారే అవకాశముంది. సేతుపతి, రుక్మిణి ఇప్పటికే ‘ఏస్’ అనే ఫ్లాప్‌ మూవీలో నటించారు.

Related Post