కేవలం 4 గంటల చర్చలు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసా.. ఇంకేముంది.. ఏపీపై మరో లక్ష కోట్ల రూపాయల పైచిలుకు.. పెట్టుబడుల కనక వర్షం కురిసింది. ఇప్పటి వరకు జరిగిన పెట్టుబడుల ప్రయత్నాలు.. ఒక ఎత్తయితే, తాజాగా ఒక్క శుక్రవారం రోజే.. కేవలం 4 గంటల్లోనే భారీసంఖ్యలో సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం.. పెట్టుబడులు పెట్టేందుకు అంగీక రించడం.. తద్వారా ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం కావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
శుక్రవారం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సీఎం చంద్రబాబు.. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ ఐ పీబీ-స్టేట్ లెవిల్ ఇన్వెస్ట్మెంట్ పాజిబిలిటీ బోర్డ్) సమావేశం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు.. పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఏపీలో ఉన్న అవకాశాలను వారికి సీఎం వివరించారు. రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా పెట్టుబడులు పెట్టాలని.. వారికి సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వారికి వివరించారు. భూమి, నీరు, విద్యుత్ సహా పన్నుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్లను అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వారికి వివరించారు.
దీనికి ముగ్ధులైన చాలా మంది పారిశ్రామిక వేత్తలు.. అక్కడికక్కడే తమ ప్రణాళికలు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వీరిలో రిలయన్స్ 202 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఓకేచెప్పింది. తద్వారా 436 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వెయ్యి ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్పీఎస్పీఎల్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా 2,081 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 600 మందికి ఉద్యోగాలను అందించనున్నారు.
అదేవిధంగా క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఎస్సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ, ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్, మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 7 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ఇలా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పైచిలుకు ఒప్పందాలు జరిగాయి. వీటి వల్ల 85 వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి.