టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే.. వారిని సరిదిద్దాల్సిన బాధ్యత మంత్రులదేనని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. జిల్లాలకు ఇంచార్జ్లుగా ఉన్న మంత్రులు.. ఆ జిల్లాలోని 7-8 మంది ఎమ్మెల్యేలను కూడా పర్యవేక్షించలేరా? అని ప్రశ్నించారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎమ్మెల్యేల ప్రస్తావనను తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు.. ఈ మేరకు ఇంచార్జ్ మంత్రులను ఉద్దేశించి కీలక బాధ్యతలు అప్పగించారు. తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను సరిదిద్దాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో కూటమి ఎమ్మెల్యేల(బీజేపీ, జనసేనలకు చెందినవారు)ను కూడా సరైన దిశగా నడిపించాలని ఇంచార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. “గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చాం. వారంతా గెలిచారు. కొందరు పొరపాట్లు చేస్తున్నారు. కొందరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారికి చెప్పిచూస్తున్నాం. వారి పద్ధతిని మార్చుకోవాలని చెబుతున్నాం. అయినా కొందరు దారిలోకి రావడం లేదు. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టండి. వారిని సరైన దిశగా నడిపించండి.“ అని చంద్రబాబు సూచించారు.
అవసరమైతే.. దారి తప్పిన ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు. ఈవిషయాన్ని కూడా ఇంచార్జ్ మంత్రులు పరిశీలించాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చలు తెచ్చే అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలను పరిశీలించాలన్నారు. అవసరమైతే.. వారికి దిశానిర్దేశం చేయాలన్నారు. మీడియా ముందు కొందరు చేస్తున్న కొన్ని కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు తావిస్తున్నాయన్న చంద్రబాబు అలాంటివారికి పార్టీల పరంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా.. ఈ సందర్భంగా వైసీపీ కి చెందిన కొందరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల దూకుడు వ్యవహారం కూడా చర్చకు వచ్చింది.