ఆఫ్రికా దేశమైన అంగోలా నుంచి ఇంధన కొనుగోళ్లకు దీర్ఘకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్లోని చమురు-సహజవాయు సంస్థలు ఆసక్తితో ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. చమురుశుద్ధి, అరుదైన ఖనిజాల వెలికితీతలో పెట్టుబడులు పెట్టేందుకు అవి ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. అంగోలా నుంచి తాము భారీగా చమురు కొనుగోళ్లు చేస్తున్నామని గుర్తుచేశారు. నాలుగురోజుల పర్యటన కోసం అంగోలాకు చేరుకున్న ఆమె ఆదివారం తమ ప్రతినిధి బృందంతో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్సాల్వెష్ లోరెన్సోతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. ఎరువుల ఉత్పత్తి, వజ్రాల శుద్ధి వంటి రంగాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారతదేశ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విద్యుత్తు వాహనాలు, సెమీకండక్టర్ల సాంకేతికత, కృత్రిమ మేధ వంటి రంగాల్లోనూ భాగస్వామ్యం పంచుకోవచ్చని తెలిపారు. అంగోలా రక్షణరంగ అవసరాలు తీర్చేందుకు భారత్ సిద్ధమని చెప్పారు. దీర్ఘకాల ఒప్పందాల ద్వారా వ్యవసాయ రంగంలో తమ కంపెనీలు భాగం పంచుకోగలవన్నారు. వందేభారత్ రైళ్లనూ ఎగుమతి చేయవచ్చని చెప్పారు. మత్స్య పరిశ్రమ, చేపల సాగుకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే వివిధ అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. భారత రాష్ట్రపతి అంగోలాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆమెకు అధ్యక్ష భవనం వద్ద సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది.
‘ఛత్తీస్గఢ్ భీముడు’కి అమెరికాలో ప్రశంసలు
ఛత్తీస్గఢ్కు చెందిన మల్లయోధుడు, సామాజికవేత్త, విద్యాదాత చింతారామ్ టిక్రిహా జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘ఛత్తీస్గఢ్ కే భీమ్ చింతారామ్’కు అమెరికాలో గొప్ప గౌరవం లభించింది. ఈ నెల 2న న్యూయార్క్లో జరిగిన అమెరికన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి ప్రశంసలు లభించాయి. నగరంలోని స్టేటెన్ ఐలాండ్లో గల సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ థియేటరులో దీన్ని ప్రదర్శించగా ప్రేక్షకులు నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. యువ దర్శకుడు ఎస్.అన్షు దురంధర్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. 154 దేశాల నుంచి 2,974 చిత్రాలు పోటీపడగా, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్రదర్శించారు. భారత్ నుంచి 8 సినిమాలు స్క్రీనింగుకు ఎంపికవగా, అందులో ‘ఛత్తీస్గఢ్ కే భీమ్’ ఒకటి. ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్ చాంపా జిల్లా బుడ్గహాన్లో చింతారామ్ టిక్రిహా 1880లో జన్మించారు. సమాజంలోని ఏ వర్గం ఆకలితో ఉన్నా సంపన్నులు సంతోషంగా ఉండలేరని చింతారామ్ నమ్మారు. ఆయన ఇంటి ధాన్యాగారపు తలుపులు నిత్యం తెరిచి ఉండేవి. ఆహారం అవసరం ఉన్నవారు తీసుకువెళ్లేవారు.
The post President Droupadi Murmu: అంగోలాతో దీర్ఘకాల ఒప్పందాలకు కంపెనీలు సిద్ధం – రాష్ట్రపతి ముర్ము appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
President Droupadi Murmu: అంగోలాతో దీర్ఘకాల ఒప్పందాలకు కంపెనీలు సిద్ధం – రాష్ట్రపతి ముర్ము
Categories: