hyderabadupdates.com movies ‘కాంత’కు ‘మాయాబజార్’ కనెక్షన్

‘కాంత’కు ‘మాయాబజార్’ కనెక్షన్

తెలుగు సినిమా చరిత్రలో ‘మాయాబజార్’ చిత్రానిది ఎప్పటికీ ప్రత్యేక స్థానం. 1957లో వచ్చిన సినిమాను ఇప్పుడు చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ తరం ప్రేక్షకులకూ అది కనెక్ట్ అవుతుంది. ఆ సినిమాలో వాడిన సాంకేతికత గురించి ఎంత చెప్పినా తక్కువే. విశేషం ఏంటంటే.. దాదాపు ఏడు దశాబ్దాల కిందట తీసిన ఆ సినిమా కోసం ఉపయోగించి కెమెరాను ఇప్పుడు.. ఓ కొత్త చిత్రం కోసం వాడారట. ఆ చిత్రమే.. కాంత. 

ఈ ఆశ్చర్యకర విషయాన్ని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమైన రానా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కాంత’ తమిళ తొలి తరం సూపర్ స్టార్లలో ఒకరైన ఎం.కె.త్యాగరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవన్ని వాస్తవాలు కాదని టీం చెబుతూనే ఉంది. కేవలం ఆ సమయంలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా తీసుకున్నవి మాత్రమే అని చెబుతున్నారు. అంటే ఈ కథ 1930-40 ప్రాంతంలో నడుస్తుందన్నమాట.

అప్పటి సినిమాలను గుర్తుకు తెచ్చేలా పాత కెమెరాలను వాడాల్సిన అవసరం ఏర్పడిందట. అందుకోసమే పాతాళ భైరవి, మాయాబజార్ చిత్రాల్లో వాడిన మిచెల్ కెమెరాను ఈ సినిమాలో వాడామని రానా వెల్లడించాడు. ట్రైలర్లో కూడా దీనికి సంబంధించిన ఒక షాట్ చూడొచ్చని రానా తెలిపాడు. తన తండ్రి సురేష్ బాబు ఒక సమయంలో వాహిని స్టూడియో నుంచి ఆ కెమెరాను తీసుకున్నట్లు రానా చెప్పాడు. 

అంతే కాక ఆ రోజుల నాటి కార్లు, ఫోన్లు సహా అప్పటి సినిమా ఎక్విప్మెంట్ అంతా ఈ చిత్రంలో ఉపయోగించినట్లు రానా వెల్లడించాడు. దుల్కర్ సల్మాన్‌కు కార్ల మీద గొప్ప అవగాహన ఉందని.. అందుకే ఏ కాలంలో ఏ కారు వాడేవాళ్లో తనకున్న ఐడియాతో వాటినే తెప్పించడానికి ప్రయత్నించాడని.. అందుకోసం తాము చాలా కష్టపడాల్సి వచ్చిందని రానా తెలిపాడు. తమిళ దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన ‘కాంత’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని రానా, దుల్కర్ కలిసి నిర్మించడం విశేషం.

Related Post