బీహార్లో జరిగిన రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రజల నాడి ఇదేనంటూ కొన్ని సర్వేలు కూడా వెలుగుచూశాయి. అయితే ఏ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్కు పెద్దగా మార్కులు వేయలేదు. అంతేకాదు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందనিও పేర్కొన్నాయి. అది కూడా భారీ మెజారిటీ దక్కించుకుంటుందనని కొన్ని సర్వేలు గణాంకాలతో వివరించాయి.
సర్వేల మాట నిజమైతే ఇది ఎన్డీయే కూటమిని బలోపేతం చేస్తుందన్నది సందేహం లేని అంశం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ హవాను బలంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘంపై అనేక ఆరోపణలు కూడా చేశారు. ఓట్ చోరీ నినాదంతో అదే బీహార్లో పర్యటనలు నిర్వహించారు. ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం ఆశించినట్టుగా కనిపించడం లేదు.
ఈ పరిణామాలతో రెండు రకాలుగా కాంగ్రెస్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇండీ కూటమిలో బలంగా ఉన్న ఆర్జేడీ తెగతెంపులు చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇప్పటికి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటివారు అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పైగా తమ తమ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్తో వారు జతకట్టడం లేదు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే మమత ఒంటరి పోరుకు రెడీ అయ్యారు.
ఇక యూపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. యూపీ ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ కూడా కాంగ్రెస్తో డిస్టెన్స్ పాటిస్తోంది.
రాహుల్ గ్రాఫ్ విచ్ఛిన్నం. రాహుల్ గాంధీ పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత వరుస పరాజయాలు వస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ మినహా ఆ పార్టీ ఎక్కడా విజయాలు సాధించలేదు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు కారణాలతోనే పార్టీ గెలుపు సాధించిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు బీహార్ కూడా పరాజయం బాటపడితే అది రాహుల్ గ్రాఫ్ను మరింత విచ్ఛిన్నం చేయడం ఖాయమని జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.