ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తరచుగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు.. వారి విజ్ఞాపనలపై స్పందిస్తున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయాని కి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించినప్పుడు.. సుమారు 4 వేల మందికి పైగా ప్రజలు వచ్చి.. తమ సమస్యలు చెప్పుకొన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా వేల మంది సమస్యలతో వచ్చారు. వారి సమస్యలను విని.. వాటిని పరిష్కరించేందుకు సీఎం, మంత్రి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పరంపరలో సీఎం సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు.. నారా భువనేశ్వరి కూడా ప్రజా ప్రతినిధి కాకపోయినా.. ప్రజలకు అండగా ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేనున్నానంటూ.. వారికి భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం సొంత నియోజకవర్గంలో కుప్పంలో పర్యటిస్తున్న భువనేశ్వరి..ఇక్కడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భువనేశ్వరి.. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం.. ప్రజాద ర్బార్ నిర్వహించారు. దీనికి కుప్పం సహా..పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు అర కిలో మీటరు మేరకు.. క్యూ లైన్ ఏర్పడింది.
వారందరినీ ఓపికగా పలకరించిన భువనేశ్వరి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఎక్కువ మంది తమకు ఇళ్లు లేవని.. సొంత ఇల్లు కల్పించాలని కోరారు. రెండో ప్రాధాన్యంగా రేషన్ కార్డు, మూడో ప్రాధాన్యంగా పింఛను కల్పించాలని ఎక్కువ మంది వినతులు సమర్పించారు. అదేవిధంగా కొందరు సీఎంఆర్ ఎఫ్ నుంచి నిధులు ఇవ్వాలని కోరారు. అయితే.. వారి నుంచి అర్జీలు తీసుకున్న నారా భువనేశ్వరి వెంటనే తన పీఏకు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీసుకు వాటిని పంపించారు. మరికొన్నింటిని అక్కడికక్కడే(ఆరోగ్య సంబంధమైన) డిజిటలీకరణ చేయించి మంత్రి నారా లోకేష్ డ్యాష్ బోర్డుకు, సీఎం చంద్రబాబు పేషీకి పంపించారు.