స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ స్పష్టం చేసింది.
మరోవైపు.. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే.. గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 23వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు ప్రజా పాలన వారోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఎన్నికల నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
కేటీఆర్, గోరెటి వెంకన్నకు బిగ్ రిలీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన కేసులో ఊరట లభించింది. 2023 ఎన్నికల సమయంలో తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ఇంటర్వ్యూలు చేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారనీ పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని విచారణ సందర్భంగా పోలీసుల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఆ ఇంటర్వ్యూ ఉందని తెలిపారు. అయితే, రాజకీయ లబ్ధి కోసమే కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
The post TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !
Categories: