hyderabadupdates.com movies హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ రంగంలో హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు పారితోషకాలు ఎక్కువ ఉంటుందన్నది కొత్త విషయం కాదు. ఓవైపు ఒక స్టార్ హీరో రూ.50 కోట్లు పుచ్చుకుంటుంటే.. అదే సినిమాలో నటించే స్టార్ హీరోయిన్‌కు అందులో నాలుగో వంతు కూడా ఇవ్వరన్న విషయం తెలిసిందే. ఈ అంతరం గురించి కొందరు హీరోయిన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఇదేం వివక్ష అని అడుగుతుంటారు. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఇదే టాపిక్ చర్చకు వస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ భలే సమాధానం ఇచ్చాడు. 

తన పక్కన ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను పెట్టుకుని.. వాళ్లు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన ఆసక్తికర జవాబు ఇచ్చాడు. ఇక్కడ ఆర్టిస్టు పురుషుడా, మహిళా అనేది సంబంధం లేదని.. ఎవరి డిమాండును బట్టి, మార్కెట్‌ను బట్టి వారికి పారితోషకం ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఒకవేళ హీరోయిన్‌‌కు మార్కెట్, డిమాండ్ ఎక్కువ ఉంటే.. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇస్తారని.. హీరోకు అంత లేకుంటే పారితోషకం తగ్గుతుందని ఆమిర్ స్పష్టం చేశాడు. 

ఇప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కూడా అచ్చంగా ఇదే రకంగా మాట్లాడింది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ పారితోషకం ఇవ్వడంపై ఆమె నెగెటివ్ కామెంట్లేమీ చేయలేదు. ఇందులో వివక్ష అంటూ ఏమీ లేదని ఆమె అభిప్రాయపడింది. ఏదైనా మార్కెట్‌ను అనుసరించే ఉంటుందని కీర్తి చెప్పింది. ఒక ఆర్టిస్టుకు ఉన్న డిమాండ్, మార్కెట్‌ను బట్టే పారితోషకం ఇస్తారని.. హీరోలతో పోలిస్తే తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే బాధ తనకు ఎప్పుడూ లేదని ఆమె అభిప్రాయపడింది. డిమాండ్‌ను బట్టే ఏదైనా ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. 

ఇక తాను లీడ్ రోల్ చేసిన ‘రివాల్వర్ రీటా’ గురించి మాట్లాడుతూ.. ఇది 24 గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిందని ఆమె చెప్పింది. సినిమాలో బోలెడన్ని ట్విస్టులుంటాయని.. థ్రిల్ చేస్తూనే వినోదాన్ని పంచుతూ సినిమా సాగుతుందని ఆమె పేర్కొంది. ‘రివాల్వర్ రీటా’ తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Post