సరిగ్గా ఇంకో పది రోజుల్లో అఖండ 2 విడుదల కానుంది. ఈసారి నార్త్ మార్కెట్ ఎక్కువగా టార్గెట్ చేసిన నిర్మాతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లు వేగవంతం చేశారు. ముంబైలో సాంగ్ లాంచ్ తో మొదలుపెట్టి వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా పలు ఈవెంట్లు చేస్తూ వచ్చారు, చేయబోతున్నారు. శుక్రవారం జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం దాదాపు ఖాయమే. బాలయ్యతో ఉన్న స్నేహం, ఒకప్పుడు టిడిపి పార్టీతో అనుబంధం దృష్ట్యా ఈ కలయిక సాధ్యమయ్యిందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది కాబట్టి అప్పటిదాకా అఫీషియల్ స్టాంప్ వేయలేం.
ఇక హైప్ విషయానికి వస్తే అఖండ మొదటి భాగం ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యిందో మూవీ లవర్స్ అంత సులభంగా మర్చిపోలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత జనాన్ని బాగా థియేటర్లకు రప్పించిన సినిమాల్లో అఖండది మొదటి స్థానం. అలాంటి దానికి సీక్వెల్ అంటే బజ్ ఓ రేంజ్ లో ఉండాలి. అయితే తమన్ ఇచ్చిన రెండు పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా ట్రైలర్ లో యాక్షన్ కంటెంట్ ఎక్కువైపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంకో పక్క ఈ వ్యవహారాలతో సంబంధం లేకుండా థియేటర్ బిజినెస్ క్రేజీగా జరిగిపోతోంది. ఈసారి టార్గెట్ రెండు వందల కోట్లట.
వీటి సంగతి ఎలా ఉన్నా అఖండ 2 ముందు రోజు సాయంత్రం ప్రీమియర్లకు రంగం సిద్ధమవుతోంది. అనుమతులు రావడం ఆలస్యం అనౌన్స్ మెంట్ ఇస్తారు. అదనపు టికెట్ రేట్లు ఉంటాయి కానీ అందుబాటు ధరల్లోనే ఉంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. మొదటి పది రోజులకు ఏపీ నుంచి ఎంత పెంపుకి జిఓ తెచ్చుకుంటారనేది వేచి చూడాలి. తెలుగులో అఖండ 2 సోలోగానే వస్తోంది. హిందీలో రణ్వీర్ సింగ్ దురంధర్ తో పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. అంచనాల బరువు ఎక్కువో తక్కువో ఎంత ఉన్నా సరే ఆడియన్స్ ని అఖండ 2 వందకు రెండు వందల శాతం మెప్పిస్తుందనేది టీమ్ నమ్మకం.