ఏపీలో కూటమి ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం గృహ నిర్మాణాలను చేపడుతోంది. పిఎంఏవై 1.00 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో, ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఈ రోజు సచివాలయంలో వెల్లడించారు.
పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 3.47 లక్షల మంది ఆవాస్ యోజన యాప్ లో దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఈ నెలాఖరు లోపు ఈ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఐదేళ్ల కాలంలో దాదాపు 15.59 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో పిఎంఏవై 1.0 క్రింద 8.87 లక్షల గృహాలు, పిఎంఏవై 2.0 అర్బన్ క్రింద 91 వేల గృహాలు, పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. వీటికి అదనంగా, పిఎంఏవై 1.00 పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇళ్ల స్థలాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించారు. అదే విధంగా, దాదాపు 1.15 లక్షల మంది ప్రభుత్వం మరియు పోరంబోకు స్థలాల్లో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్లను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కామన్ వాల్ తో ట్విన్ హౌసెస్ నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జి.ఓ.ను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.