రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చాలా పెద్ద రీజనే ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఆయన ప్రసంగించినా ఈ మాటే చెబుతున్నారు. సూపర్ జీఎస్టీ నుంచి పల్లె పండుగ వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా జనసేన తరఫున పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు.
దీనిని వైసీపీ నాయకులు ఎద్దేవా చేయడం తెలిసిందే. అయితే పవన్ అంత తెలివి లేని వాడు రాజకీయంగా పరిణితి లేని వాడు అనుకుంటే పొరపాటేనని పరిశీలకులు చెబుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యల వెనుక చాలా వ్యూహం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రెండు కారణాలను వారు చెబుతున్నారు.
కూటమి పార్టీల నాయకులను కలిసికట్టుగా ఉంచాలి: ఇది వాస్తవం. కొన్నాళ్లుగా కూటమి పార్టీల్లో నాయకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. అయితే ఎవరినీ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారంతట వారు తెలుసుకునేలా పవన్ కల్యాణ్ చంద్రబాబు సైతం వచ్చే 15 ఏళ్లు కూడా తమ కూటమి ఉంటుందని చెబుతున్నారు. తద్వారా నాయకులను ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నాయకులు ఈ విషయాన్ని గ్రహించలేక పోతే వారే నష్టపోతారన్న సందేశం ఈ వ్యాఖ్యల్లో ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం: రాజకీయాల్లో ఈ వ్యూహం చాలా కీలకం. క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరూ పోటీలో ఉన్నా అంతిమంగా ప్రజలే ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో మానసికంగా వారిని ఆకట్టుకునేందుకు పార్టీలు చేసే ప్రయత్నాల్లో ఇలాంటి ప్రకటనలు కీలకం. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ ప్రకటించారు. దీనిని వైసీపీ లైట్ తీసుకుంది. ఫలితంగా 11 స్థానాలకు పరిమితం అయింది.
ఇక ఇప్పుడు వచ్చే 15 ఏళ్లు కూడా కూటమి అధికారంలో ఉంటుందన్న వాదనను బలంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలన్న వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్కసారి ప్రజలు కనుక ఫిక్స్ అయితే దీనికి తిరుగు ఉండదు. అందుకే పదేపదే కూటమి పార్టీలు 15 ఏళ్ల మంత్రం పఠిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.