క్రికెట్ గ్రౌండ్లో పరుగుల వరద పారించే జెమీమా రోడ్రిగ్స్, నిజ జీవితంలో స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నిరూపించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల ‘బిగ్ బాష్ లీగ్’ (WBBL) నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. బ్రిస్బేన్ హీట్ జట్టుకు కీలక ప్లేయర్ అయినా, ఇప్పుడు ఆట కంటే తన బెస్ట్ ఫ్రెండ్ స్మృతి మంధాన కుటుంబమే ముఖ్యమని ఫీల్ అయ్యింది. అందుకే లీగ్ మొత్తానికి గుడ్ బై చెప్పేసి, తిరిగి ఆస్ట్రేలియా వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యింది.
అసలు విషయం ఏంటంటే, టీమిండియా స్టార్ స్మృతి మంధాన పెళ్లి వేడుకల కోసం జెమీమా 10 రోజుల క్రితమే ఇండియా వచ్చింది. అంతా సందడిగా ఉన్న టైంలో, స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు పెళ్లి జరగదు. పెళ్లి మధ్యలో ఆగిపోవడంతో స్మృతి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది.
ఇలాంటి ఎమోషనల్ టైంలో స్నేహితురాలిని వదిలి వెళ్లడానికి జెమీమా మనసు ఒప్పుకోలేదు. తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి క్రికెట్ ఆడటం కంటే, ఇక్కడే ఉండి స్మృతికి, ఆమె కుటుంబానికి అండగా నిలవడమే కరెక్ట్ అని భావించింది. అందుకే మిగతా సీజన్ ఆడలేనని తన ఫ్రాంచైజీకి రిక్వెస్ట్ పెట్టింది. ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు, కానీ ఆప్తమిత్రులకు కష్టం వచ్చినప్పుడు తోడుండటమే నిజమైన గెలుపు అని తన చర్యతో చాటిచెప్పింది.
జెమీమా తీసుకున్న నిర్ణయాన్ని బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం కూడా హుందాగా గౌరవించింది. “జెమీమా మా టాప్ పిక్, ఆమె లేకపోవడం టీమ్కి పెద్ద లోటే. కానీ ప్రస్తుతం ఆమె క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే ఆమె ఇండియాలోనే ఉండటానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. స్మృతి వాళ్ళ నాన్నగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అని సీఈఓ టెర్రీ స్వెన్సన్ ప్రకటించారు. ప్రొఫెషనల్ గేమ్ అయినా, వ్యక్తిగత ఎమోషన్లకు విలువ ఇవ్వడం ఇక్కడ గొప్ప విషయం.
జెమీమా స్మృతి మంధానల బాండింగ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. గ్రౌండ్ లోనే కాదు బయట కూడా వీరిద్దరూ సిస్టర్స్లా ఉంటారు. ఇప్పుడు జెమీమా తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. “ఫ్రెండ్షిప్ గోల్స్ అంటే ఇదే” అని కామెంట్స్ చేస్తున్నారు. భారీ కాంట్రాక్ట్, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న లీగ్ను పక్కనపెట్టి, స్నేహం కోసం నిలబడిన జెమీమా ఇప్పుడు రియల్ లైఫ్ స్టార్గా మారింది.