hyderabadupdates.com movies WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..

WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..

సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ (0-2) అవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఆశలకు గండి కొట్టినట్టే. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ పోయింది. ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కంటే కిందకు (5వ స్థానం) పడిపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి మన జట్టుకు ఏకంగా 8 నెలల సుదీర్ఘ విరామం దొరికింది. అవును, వచ్చే ఏడాది జూన్ వరకు మనకు టెస్ట్ మ్యాచ్ లేనట్టే. ఈ గ్యాప్ ప్లేయర్లకు రెస్ట్ ఇస్తుందో లేక ఫామ్ పోగొడుతుందో తెలియదు కానీ, ఫైనల్ ఆశలు మాత్రం ఆవిరయ్యేలా ఉన్నాయి.

అసలు ఫైనల్ చేరాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం మన విజయాల శాతం (PCT) కేవలం 48.15 మాత్రమే. ఫైనల్ రేసులో నిలవాలంటే దీన్ని కనీసం 60 శాతానికి పెంచుకోవాలి. మన చేతిలో ఇంకా 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం 6 మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా, లెక్కలు తారుమారవుతాయి. మహా అయితే 3 మ్యాచ్‌లు డ్రా చేసుకోవచ్చు కానీ, ఓటమికి మాత్రం అస్సలు ఛాన్స్ లేదు. ఇది నిజంగా కత్తి మీద సాము లాంటి వ్యవహారమే.

ఈ 8 నెలల బ్రేక్ తర్వాత, 2026 జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్ ఉంది కానీ, అది WTC పరిధిలోకి రాదు. అసలు సిసలైన యుద్ధం ఆగస్టులో మొదలవుతుంది. శ్రీలంకలో 2 టెస్టులు, ఆ తర్వాత న్యూజిలాండ్‌లో 2 టెస్టులు ఆడాలి. సొంతగడ్డపైనే మనం కివీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయాం, ఇక వారి గడ్డపై గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ నాలుగు విదేశీ టెస్టుల్లో ఏ మాత్రం తడబడినా టీమిండియా ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది.

విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చాక, చివరగా ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) మన గడ్డపైనే ఉంది. ఒకప్పుడు సొంతగడ్డపై మనల్ని కొట్టేవాడు లేడు అనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు మనల్ని మన గ్రౌండ్స్‌లోనే ఓడించాయి. ఇలాంటి టైంలో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలు. ఆ 5 మ్యాచ్‌లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వరుసగా రెండుసార్లు WTC ఫైనల్ వెళ్లిన రికార్డు మనకుంది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలంటే మాత్రం అద్భుతాలు జరగాల్సిందే.

Related Post

జూబ్లీహిల్స్ ముచ్చ‌ట‌: ట‌పాసులు కావాలంట సార్‌!జూబ్లీహిల్స్ ముచ్చ‌ట‌: ట‌పాసులు కావాలంట సార్‌!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ‌.. అభ్య‌ర్థుల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. దీపావ‌ళి నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా పండ‌గ హ‌డావుడిలో ఉంటార‌ని భావించిన పార్టీల అభ్య‌ర్థులు కార్యాల‌యాల‌కు ప‌రిమితం అయ్యారు. స‌మీపంలో ఉన్న అనుచ‌రులు.. పార్టీ కీల‌క నాయ‌కుల‌ను పిలిపించుకుని.. ఎన్నిక‌ల‌పై మంత్రాంగం న‌డుపుతున్నారు.