ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి పీల్చడమే ఒక పెద్ద సాహసంగా మారింది. ఈ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, దేశం ఎదుర్కొంటున్న ఒక ‘హెల్త్ ఎమర్జెన్సీ’ అని ఆయన హెచ్చరించారు.
రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తల్లుల ఆవేదనను ప్రస్తావించారు. “నేను కలిసిన ప్రతి తల్లి భయపడుతోంది. తమ పిల్లలు విషపూరితమైన గాలిని పీలుస్తూ పెరుగుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబాలు ఇప్పుడు భయంతో, కోపంతో అలసిపోయారు” అని రాహుల్ పేర్కొన్నారు. ఏటా కాలుష్యం పెరుగుతున్నా, కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన చర్యలు లేకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మోదీ గారూ, మన కళ్ల ముందే దేశంలోని పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? మీ ప్రభుత్వానికి దీనిపై ఎందుకు అత్యవసర భావం లేదు? ఎందుకు ఎలాంటి ప్లాన్ లేదు? జవాబుదారీతనం ఎందుకు లోపించింది?” అంటూ సూటి ప్రశ్నలు వేశారు. పాలకులు మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు.
ఈ సమస్యపై వెంటనే పార్లమెంటులో లోతైన చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా, కాలుష్యాన్ని అరికట్టడానికి కఠినమైన జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కోరారు. ఇకపై సాకులు చెప్పడం, ప్రజల దృష్టి మరల్చడం కుదరదని, స్వచ్ఛమైన గాలి ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని ఆయన తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ‘సివియర్’ కేటగిరీలో కాలుష్యం ఉండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కొంతమంది తల్లులతో మాట్లాడిన 8 నిమిషాల వీడియోను షేర్ చేస్తూ, ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి.