తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిన్నరగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు అసెంబ్లీకి, అటు జనంలోకి రాకుండా కేసీఆర్ కేవలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని రేవంత్ పలుమార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ గోడకి వేలాడదీసిన తుపాకీలా సైలెంట్ గా ఉంటారని, కానీ ఆ తుపాకీకి ఎప్పుడు ఎలా పేలాలో బాగా తెలుసని కేటీఆర్ అన్నారు. అవసరమైనప్పుడు, సమయం రాగానే ఆ తుపాకీ పేలుతుందని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి గత రెండేళ్లలో ఇచ్చిన స్పీచ్ లలో కేసీఆర్ పేరెత్తకుండా ఒక్క స్పీచ్ లేదని, కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా రేవంత్ పేరెత్తలేదని ఎద్దేవా చేశారు.
అది కేసీఆర్ స్థాయి అని, రేవంత్ స్థాయి ఏంటో ఆయన తెలుసుకోవాలని కేటీఆర్ అన్నారు. నాయకుడికి, అర్భకుడికి ఉన్న తేడా ఇదేనని చురకలు అంటించారు. కేసీఆర్ మాట్లాడినా సంచలనమేనని, మాట్లాడకపోయినా సంచలనమేనని వ్యాఖ్యానించారు. తీస్ మార్ ఖాన్ లా రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాత్రమే మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
సరిగ్గా 16 ఏళ్ల క్రితం నవంబరు 29న ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ త్యాగాన్ని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను బీఆర్ఎస్ నేతలు స్మరించారు.