సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే రచ్చ. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ తన ‘WTF’ పాడ్కాస్ట్ కోసం వదిలిన ఒక చిన్న టీజర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఎందుకంటే అందులో ఆయన పక్కన కూర్చుంది ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్! వీళ్లిద్దరూ కలిసి ఉన్న వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక ఇండియన్ యూట్యూబర్ షోకి మస్క్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియో నిజమా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన మాయా? అనే అనుమానాలు ఇప్పుడు అందరినీ తొలుస్తున్నాయి.
నిఖిల్ కామత్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో షేర్ చేసిన ఈ 39 సెకన్ల వీడియో చాలా వెరైటీగా ఉంది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇందులో నిఖిల్, మస్క్ ఒకరినొకరు చూసుకుని పగలబడి నవ్వుకుంటున్నారు. మధ్యలో కాఫీ తాగుతున్నారు. నిఖిల్ చేతిలో ఉన్న కప్పుపై ‘SpaceX’ లోగో కూడా కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే, వీడియో మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం కాగితాల శబ్దం, నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి. “దీనికి క్యాప్షన్ ఇవ్వండి” అని నిఖిల్ పెట్టిన చిన్న పోస్ట్ ఇప్పుడు పెద్ద డిబేట్కి దారితీసింది.
ఈ వీడియో చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. “ఇది నిజంగా ఎలాన్ మస్కేనా? లేక ఏఐతో మార్ఫింగ్ చేశారా?” అని కామెంట్స్ బాక్స్ని నింపేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో నిజమా కాదా అని నెటిజన్లు మస్క్ సొంత ఏఐ అయిన ‘గ్రోక్’ (Grok)ని అడిగారు. దానికి అది ఇచ్చిన సమాధానం కన్ఫ్యూజన్ని ఇంకా పెంచింది. “ఈ వీడియోలో ఫేస్ మార్ఫింగ్ జరిగినట్లు అనిపిస్తోంది, ఇది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉంది” అని గ్రోక్ చెప్పింది. కానీ అదే సమయంలో, ఇది నిజంగానే రాబోయే ఎపిసోడ్ టీజర్ కావొచ్చని, ప్రమోషన్ కోసం ఇలా ఎడిట్ చేసి ఉండొచ్చని కూడా హింట్ ఇచ్చింది. దీంతో సస్పెన్స్ హై లెవెల్ కి చేరింది.
నిఖిల్ కామత్ పాడ్కాస్ట్కి ఒక బ్రాండ్ ఉంది. గతంలో బిల్ గేట్స్, కిరణ్ మజుందార్ షా, రణబీర్ కపూర్, ఏకంగా ప్రధాని మోదీనే ఇంటర్వ్యూ చేసిన రికార్డ్ ఆయనది. 2025లో ఇదే బిగ్గెస్ట్ కొలాబరేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఇది నిజమో, గ్రాఫిక్స్ మాయాజాలమో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
View this post on Instagram