సాధారణంగా కేసుల నుంచి తప్పించుకుంటున్న కొందరు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాలను కూడా విస్మరిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై జంట హత్యల కేసు నమోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లపాటు తప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి మధ్యంతర ముందస్తు బెయిల్ పొందారు. అయితే.. దీనిని పోలీసులు సవాల్ చేయడంతో రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు పొలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
అయితే.. దీనికి రెండు వారాల సమయం ఇచ్చింది. సహజంగా.. ఈ సమయంలో తప్పించుకునే అవకాశం ఉన్నా.. ఎందుకో.. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సోమవారం మధ్యాహ్నం.. స్థానిక కోర్టులో లొంగిపోయారు. పల్నాడు స్థానిక కోర్టుకు ఒంటరిగా వచ్చిన వెంకట్రామిరెడ్డి.. తాను లొంగిపోతున్నట్టు చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసులో తన ప్రమేయం లేదని..తనకు ఎలాంటి సంబంధం లేదని.. అయినా విచారణకు సహకరిస్తానని వెల్లడించడం గమనార్హం. దీనిపై కోర్టు స్పందిస్తూ.. స్థానిక పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
రామకృష్ణారెడ్డి ఎక్కడ?
ఇక, ఈ జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా లొంగిపోవాల్సి ఉంది. అన్నదమ్ములు ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. పిన్నెల్లి మాత్రం లొంగిపోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. ఆయన హైదరాబాద్ కానీ, బెంగళూరుకు కానీ వెళ్లారని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అయితే, రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఏడాది మేలో .. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఇద్దరు అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వీరిలో పిన్నెల్లి సోదరులు కూడా ఉన్నారు. కేసు నమోదయ్యాక.. వీరిద్దరూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతోపాటు కస్టీడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులను ఆదేశించింది.