ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం, నిర్మల్లో ఏటీసీ ఏర్పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగు, సాగునీటి కోసం తుమ్మిడిహెట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కొత్తగా అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు సీఎం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన “ప్రజా పాలన ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్లో జరగాల్సినంత అభివృద్ధి, జిల్లాకు రావలసిన నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసుకుంటున్నామో అదే తరహాలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. చనాక – కొరాట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరును, సదర్మట్ బ్యారేజీకి స్వతంత్ర సమర యోధుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరును పెడుతున్నాం అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి.
పదేళ్ల పాటు చనాకా కొరాట పూర్తి చేయలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని చెప్పారు. నిర్మల్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సరస్వతీ ఆలయమున్న బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించుకుంటూ పోతే ప్రారంభం కాదన్నారు. అందుకే బాసరలో వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రజాప్రతినిధులు అందుకు సహకరించాలని కోరారు.
The post ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి వరాల వెల్లువ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి వరాల వెల్లువ
Categories: