hyderabadupdates.com movies మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

గాజువాక సమీపంలోని గంగవరం పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారిని యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిస్కెట్లు, తినుబండారాలు కొనిపెడతానని నమ్మబలికి చిన్నారిని తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లి అనుమానంతో నిందితుడిని నిలదీయగా ఘటన బయటపడింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్‌బాడీని గుర్తించారు.

కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను అత్యాచారం చేసి చంపినట్లు గుర్తించారు. ఆ తర్వాత కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అది మరువక ముందే విశాఖలో మరో అత్యాచారయత్నం ఘటన వెలుగు చూసింది.

Related Post