వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి ఇబ్బంది పెట్టినా జనం పట్టించుకునేవాళ్ళు కాదు. కుర్చీలు విరిగినా, నల్లులు కుట్టినా, ఫ్యాన్లు తిరక్కపోయినా సర్దుకుని చూసేవాళ్లు. తర్వాత 35 ఎంఎం, 70 ఎంఎం వచ్చాయి. ఊరూరా ఏసీ థియేటర్లు పెరిగాయి. డీటీఎస్ అంటే డిజిటల్ సౌండ్ సిస్టమ్ జనాలకు థ్రిల్లింగ్ ఆడియో ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. మల్టీప్లెక్సుల డామినేషన్ మొదలయ్యింది.
ఇప్పుడిది కొత్త పుంతలు తొక్కుతోంది. అల్లు సినిమాస్ లో పరిచయం చేసిన డాల్బీ సినిమా స్క్రీన్ చూసి ఆడియన్స్ నోరెళ్లబెట్టడం ఖాయం. క్లారిటీ, డిటైలింగ్ చూసి ఇంకో సాధారణ స్క్రీన్ కు వెళ్లడం కష్టమే అనిపించేలా ఉంది. రాబోయే దురంధర్ రివెంజ్, డెకాయిట్, బైకర్, పెద్ది, ప్యారడైజ్ మొదలైన ప్యాన్ ఇండియా మూవీస్ ప్రత్యేకంగా డాల్బీ సినిమా టెక్నాలజీకి అనుగుణంగా తమ ప్రింట్లను ఆప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. భారీ ఖర్చవుతున్నా రెడీ అంటున్నాయి.
రాబోయే రోజుల్లో డాల్బీ సినిమా, డాల్బీ విజన్, ఐమాక్స్, ఐస్, ఎపిక్, పీసీఎక్స్ లాంటి విభిన్న ఫార్మాట్ల వల్ల మాములు థియేటర్లు, మల్టీప్లెక్సులకు వెళ్లే జనాల సంఖ్య తగ్గిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇప్పటికిప్పుడు కాదు కానీ ఒక అయిదారు సంవత్సరాల్లో అనూహ్యమైన మార్పులు చూడటం ఖాయం. ఇప్పటికే చాలా బిసి సెంటర్లలో సింగల్ స్క్రీన్లకు కనీస ఆక్యుపెన్సీలు లేవు. కారణం పాత స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్, సరైన వసతులు లేకపోవడం లాంటివి జనాన్ని రాకుండా చేస్తున్నాయి.
ఎలాగైతే బ్లాక్ అండ్ వైట్ టీవీలు వదిలేసి కలర్ టీవీలకు వచ్చామో, 14 ఇంచుల నుంచి 100 ఇంచుల స్మార్ట్ టీవీలకు ఎదిగామో అదే తరహాలో థియేటర్ పరంగా వస్తున్న విప్లవాత్మక మార్పులు ఎగ్జిబిటర్లకు కొత్త సవాళ్లు విసరడం ఖాయం. అంతెందుకు వారణాసి కోసమే రినోవేట్ చేసుకోవాల్సిన థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా ఉంటాయని ఒక అంచనా. లేదంటే టికెట్లు తెగవు. ఇదే కాదు విజువల్ గ్రాండియర్స్ అన్నీ కంటెంట్ పరంగా బెస్ట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డిమాండ్ చేస్తాయి. వాటిని అందుకోగలితేనే మనుగడ ఉంటుంది.