అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి జైలు పాలవడం.. ఆయన ఫామ్హౌస్పై కూడా తీవ్ర ఆరోపణలు రావడంతో వ్యక్తిగతంగా రోహిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని, అసెంబ్లీలో తూర్పారబట్టాలని ముందునుంచి ఆయుధాలు సిద్ధం చేసుకున్న బీఆర్ఎస్కు రోహిత్ రెడ్డి వ్యవహారం సడెన్ బ్రేకులు వేసేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు సమర్థించలేని పరిస్తితి.. ఇటు రోహిత్రెడ్డిని సామాజికంగా, ఆర్థికంగా కూడా కాదనలేని పరిస్థితిని పార్టీ ఎదుర్కొంటోంది. రోహిత్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చుకానీ.. బహిష్కరించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీని దృష్టిలో పెట్టుకుని.. తాజాగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. మాదకద్రవ్యాలతో కూడిన పార్టీ ఇవ్వడం, ఈ పార్టీలో పలువురు వ్యాపారులు, ఇతర నేతలను పిలవడం, మరీ ముఖ్యంగా పోలీసులపై కాల్పులు జరపడం వంటి వాటిని ప్రస్తావించిన బీఆర్ఎస్.. వాటికి వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం రోహిత్ రెడ్డి 14 రోజులపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అయితే.. ఆయన మంగళవారం బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సంజాయిషీ నోటీసులను రోహిత్ రెడ్డి వాట్సాప్ సహా.. ఆయన ఈ-మెయిల్కు పంపించారు. అదేవిధంగా హార్డ్ కాపీని రోహిత్రెడ్డి కార్యాలయానికి పంపించనున్నారు. ఇది ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తమకు కొంత మేరకు ఉపశమనం ఇస్తుందని బీఆర్ఎస్ నాయకత్వం తలపోస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి వివాదం ఇక్కడితో సరిపెడతారా..? లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అనేది చూడాలి.