టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం వినిపిస్తూనే ఉంది. ఏటా టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఈ డిమాండ్ పై తీర్మానం చేస్తూనే ఉంటుంది.
అంతేకాకెుండా వీలయిన అన్ని మార్గాల ద్వారా కూడా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు సాధించే దిశగా టీడీపీ సాగుతోంది. అయినా కూడా నేటికీ ఎన్టీఆర్ కు భారత రత్న అందలేదు. దీని వెనుక అసలు కారణం ఇదేనంటూ ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తనదైన శైలిలో స్పందించిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్ కు ఇప్పటిదాకా భారత రత్న ఎందుకు రాలేదన్న ప్రశ్నకూ ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటిస్తే… తాను దానిని అందుకుంటానన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీనే ఆయనకు భారత రత్నను అడ్డుకుంటోందని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ భారత రత్న అవార్డును తాను అందుకుంటానన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీనే ఆయనకు అవార్డు రాకుండా చేస్తోందని కూడా సంచలన ఆరోపణలు గుప్పించారు.
ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డును సాధించడం కోసం తాను చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితుడిగా పేరున్న దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను తాను కలిశానని చెప్పారు. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ నూ కలిశానన్నారు. వారిద్దరూ ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇప్పిస్తామని, అదో చిన్న విషమయని కూడా చెప్పారన్నారు. అయినా కూడా ఎన్టీఆర్ కు భారత రత్న రాలేదన్నారు. ఈ క్రమంలో తాను ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని కూడా కలిశానని ఆమె చెప్పుకొచ్చారు.
దేవేగౌడ, గుజ్రాల్ లు తన వద్ద అసలు విషయం దాచారన్న లక్ష్మీపార్వతి… వాజ్ పేయి మాత్రం తనకు నిజాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబమే ఆయనకు అవార్డు రాకుండా అడ్డుకుంటోందన్న వాజ్ పేయి… అందుకు కారణం మీరేనని చెప్పారని ఆమె తెలిపారు.
మీ చేతుల మీదుగా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు రావడం ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇష్ట లేదని వాజ్ పేయి తనకు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఇక మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు పేరిట చేసే తీర్మానాలను ఆ పార్టీ నేతలు మహానాడు ముగియగానే బుట్ట దాఖలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.