కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక.. రెండు రోజుల్లో కొత్తపార్టీకి కూడా రెడీ అయ్యారు. అయితే.. తండ్రి నుంచి తెచ్చుకున్న వారసత్వమో.. లేక స్వతహాగానే.. సంపాయించుకున్న పొలిటికల్ తెలివి తేటలో మొత్తంగా.. ఏదేమైనా.. పార్టీ పెట్టకుండానే.. రాజకీయంగా పరుగులు పెడుతున్నారు. ఏ క్షణాన ఏ పార్టీ నుంచి ఎవరికి స్వాగతం పలుకుతారో.. అన్న చర్చ తెరమీదకు వచ్చిందంటే.. కవిత దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు..
ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఇదేసమయంలో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులకు కూడా కొదవలేని జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నాయకులకు కవిత ఆహ్వానాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీలు మారి.. బీఆర్ ఎస్లో చేరిన నాయకులు.. తర్వాత కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. గత ఎన్నికల్లో టికెట్లు కూడా కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారికి కవిత పెట్టబోయే పార్టీ తురుపు ముక్కగా మారింది. మరోవైపు.. కవితకు వీరే పెద్దదిక్కుగా కూడా మారుతున్నారు.
ఆదిలాబాద్కు చెందిన మాజీ ఎమ్మెల్యే బోధ్ నియోజకవర్గానికి చెందిన రాధోడ్ బాపూరావు ఇటీవ లేకవిత సమక్షంలో జాగృతి కండువా కప్పుకొన్నారు. నిజానికి సీనియర్ నాయకుడిగా పేరున్న బాపూరావుకు.. గిరిజన సామాజిక వర్గంలో బలమైన కేడర్ ఉంది. గతంలో కాంగ్రెస్ తర్వాత.. బీఆర్ ఎస్.. గత ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన ఆయన.. తిరిగి మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా.. కూడా ఆయనకు గుర్తింపు లేదన్న కారణంతో.. ఇప్పుడు కవిత కు జై కొట్టారు. ఇలాంటి వారి వల్ల తన పార్టీతొందరగా పుంజుకుంటుందన్న ఉద్దేశంతో కవిత సైతం ఆయనకు స్వాగతం పలికారు.
ఈయన ఒక్కరే కాదు.. జిల్లాలోని పలువురు మాజీ బీఆర్ ఎస్ నాయకుల నుంచి ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల వరకు కూడా కవిత ఇంటికి క్యూకట్టారని జాగృతి నాయకులు చెబుతున్నారు. ఇక, ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే.. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి.. తర్వాత బీఆర్ ఎస్లోకి చేరిన ఉపేంద్రరెడ్డి సైతం కవితకు టచ్లోకి వచ్చారు. ఈయన కూడా బలమైన కేడర్ ఉన్న నాయకుడే. పార్టీ ప్రారంభం కాగానే..కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారు. ఇక, ఈయనతో పాటు.. ఖమ్మానికి చెందిన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి ఒకరు రెడీగా ఉన్నారన్న చర్చ సాగుతోంది.
వేదికపై 10 మంది..
పార్టీ ప్రారంభించనున్న వేదికపైనే కవిత బలమైన 10 మంది నాయకులకు కండువా కప్పేలా ప్లాన్ చేశారని జాగృతి నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వారితో చర్చలు కూడా పూర్తయ్యాయని, పార్టీ ఆవిర్భావం రోజు.. వారికి వేదికపైనే తీర్థం ఇవ్వనున్నారని అంటున్నారు. వీరిలో కాంగ్రెస్.. బీఆర్ ఎస్ నాయకులు కూడా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా.. కేసీఆర్ తనయ.. తన రాజకీయ వ్యూహాలను చాలా సైలెంట్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేసమయంలో దూకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు.