తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగానే ఈ ఫిర్యాదులు ఢిల్లీ వరకు చేరుతున్నాయన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇటీవల రాజ్యసభ సభ్యత్వం దక్కని కొందరు నేతలు.. సహా మంత్రి వర్గంలో చోటు ఆశించిన మరికొందరు కూడా సీఎం వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ ఎస్కు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ.. కొత్త మార్గం ఎంచు కుంటున్నారన్న చర్చ ఉంది. అంటే.. నేరుగా సీఎంపై ఆరోపణలు చేయకుండా బీఆర్ ఎస్ దూకుడుగా వ్యవహరించేలా మనోళ్లు వ్యవహరిస్తున్నారంటూ.. సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు సహా మరికొందరు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సహజంగా ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంటుంది. ఇదే వీరికి కూడా కావాలి.
ఈ ఫిర్యాదులపై పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్గాంధీ సీరియస్ అయిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి.. రాహుల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన వివరించారు. పైకి మాత్రం అభివృద్ది, సంక్షేమం సహా.. రాష్ట్రంలో జరుగుతున్న పాలనను వివరించానని ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం బీఆర్ ఎస్కు అవకాశం ఇచ్చేలా జరుగుతున్న పరిణామాలపైనే ఆయన అధిష్టానానికి సంజాయిషీ చెప్పుకొన్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ ఎస్లో చేరిన నేపథ్యంపై పార్టీ వివరణ కోరినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆదిలోనే ఈ విషయంపై రాహుల్ దిశానిర్దేశం చేశారు. సీనియర్లను కోల్పోవద్దని కూడా చెప్పారు. ఏం చేసినా.. సరే.. వారు పార్టీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేసమయంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని కూడా తేల్చి చెప్పారు.
ఇక, కాళేశ్వరం పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పక్కన పెట్టడం ద్వారా బీఆర్ ఎస్కు అవకాశం ఇచ్చినట్టు అయిందన్న అంశంపైనా గౌడ్ వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చిందని తెలిసింది. ఈ రెండు అంశాలు కూడా.. బీఆర్ ఎస్కు ఊతం ఇచ్చేలా ఉన్నాయని.. సీనియర్లు చేసిన వాదనపై ఆయన అధిష్టానానికి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతానికి సీనియర్లు ఊహించినంత సీరియస్గా అధిష్టానం స్పందించలేదని.. కానీ భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని తేల్చి చెప్పిందని తెలిసింది.