ఖమ్మం జిల్లా : ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర , అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు గరిష్టంగా 3 నెలల గడువు విధిస్తున్నాం అన్నారు. ఈలోపు ప్రతి దరఖాస్తుకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సాధా బైనామా సమస్యలను 45 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇళ్లు లేక ఇబ్బంది పడ్డ పేదలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశాం అన్నారు. ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తూ పారదర్శకత పాటిస్తున్నాం అని చెప్పారు. త్వరలోనే రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. రూరల్ మండల పరిధిలోని 12 గ్రామాల్లో గత రెండున్నరేళ్లలో రూ.386 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. రూ. 20,656 కోట్లతో 25 లక్షల మందికి రైతు రుణమాఫీ పూర్తి చేశామని, సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న అర్హులకు త్వరలోనే శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు.
The post త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ
Categories: