ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహమ్మద్ బాబు హాజరయ్యారు.
ఈనెల 16వతేదీ ఉదయం ప్రధాని మోడీ సున్నిపెంట వద్ద ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం బయలుదేరి వెళతారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. తర్వాత శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు సమీపంలోని నన్నూరు రంగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రధాని మోడీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ ప్రసంగిస్తారు. సభానంతరం ప్రధాని మోడీ సాయంత్రం కర్నూలు సమీపాన గల ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుని డిల్లీ బయలుదేరి వెళ్తారు.
రాష్ట్రవ్యాప్తంగా సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై పెద్దఎత్తున నిర్వహించిన ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం చర్చించింది. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ… ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ
98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. నూతన జిఎస్ టి విధానంవల్ల కలిగే లబ్ధిపై రాష్ట్రవ్యాప్తంగా హాస్పటల్స్ లో 22,500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… నూతన జిఎస్ టి అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఆటోమొబైల్ సేల్స్ గణనీయంగా పెరిగాయని, ఈ పెరుగుదల 33శాతానికి పైగా ఉందని చెప్పారు. లగ్జరీ కార్లకు సైతం సెస్సును తొలగించడం వల్ల ఆ విభాగంలో కూడా అమ్మకాలు ఆశాజనకంగా నమోదవుతున్నాయని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 16నుంచి 19 తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జిఎస్టి షాపింగ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను మంత్రుల బృందం కోరింది.
The post Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం
Categories: