జనసేన-టీడీపీ పొత్తుపై కీలక సంచలన వ్యవహారం.. ప్రభావం చూపించనుందా? టీడీపీకి చెందిన యువ నాయకుడు తొలి సారి విజయం దక్కించుకున్న బొజ్జల సుదీర్ రెడ్డి వ్యవహారం.. మంట పెడుతోందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. దీనికి తోడు వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా.. జనసేన- టీడీపీలను కుదిపేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో.. మరింతగా జనసేన వర్గాలను కుదిపేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీమకు చెందిన జనసేన నాయకులు పట్టు బడుతున్నట్టు తెలిసింది.
ఏం జరిగింది?
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్.. కోట వినుతి.. ఇటీవల తన కారు డ్రైవర్ హత్య కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ.. జనసేన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వినుతి మాత్రం తాను జనసేనతోనే ఉన్నానని.. ఉంటానని కూడా చెబుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరించినా.. ఆమె కండువా మాత్రం వదల కుండా పలు సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసిన కారు డ్రైవర్.. రాయుడు వీడియో.. సంచలనంగా మారింది.
వినుతి ప్రైవేటు వీడియోలను తనకు తీసుకువచ్చి ఇస్తే.. 30-60 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని రాయుడు ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. తీసుకురాకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇదే.. అతని హత్యకు దారి తీసిందన్నది స్పష్టమ వుతోంది. నిజానికి అప్పట్లోనే ఈ విషయం చర్చకు వచ్చినా.. జనసేన వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు.. టీడీపీ కూడా.. ఎమ్మెల్యే బొజ్జలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఈ పరిణామాల క్రమంలోనే వినుతిపై జనసేన బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. తాజా వీడియోతో .. తన తప్పులేదని వినుతి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇదేసమయంలో సుధీర్ ప్రోద్బలంతో తనకు సంబంధించిన వీడియోలను ఎమ్మెల్యే తీసుకోవాలని భావించారని కూడా ఆమె చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా.. ఎమ్మెల్యే చుట్టూ చేరింది. అంతేకాదు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలన్నది జనసేన వర్గాలు చెబుతున్న మాట. మరోవైపు.. పవన్ మౌనంగా ఉంటే కుదరదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.