బియ్యం తీసుకొచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో మూడు అంతర్గత చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సోమవారం ఉదయం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మంత్రి మనోహర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గాజువాక గేట్ వే సి.ఎఫ్.ఎస్. షీలా నగర్ వద్ద, శ్రవణ్ సి.ఎఫ్.ఎస్. షీలా నగర్ వద్ద, బిపిఎల్ ఇంటిగ్రల్ సి.ఎఫ్.ఎస్. పెదగంట్యాడ లలో మూడు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే అవి పని చేయడం ప్రారంభించాయని చెప్పారు. ఈ చెక్ పోస్ట్ లు 24 గంటలు మూడు షిఫ్టుల్లో పని చేస్తాయని ,33 మంది సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు.
పౌరసరఫరాల శాఖలో గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు, ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన పోర్టిఫైడ్ రైస్ ప్రజలకు అందిస్తున్నదని, ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు, పిడిఎస్ బియ్యం అవునో కాదో గుర్తించడానికి 700 మొబైల్ రాపిడ్ కిడ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ రాపిడ్ కిట్లలో పొటాషియం థయో సైనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాటిల్స్ ఉంటాయని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ అయినట్లయితే ఈ ద్రావణాలు చల్లితే అవి ఎరుపు రంగుకు మారుతాయని బయట దుకాణాల్లో అమ్మే బియ్యం అయితే రంగు మారవు అని తెలిపారు. గతంలో అయితే అక్రమ బియ్యం పట్టుకున్న తర్వాత ల్యాబ్ కి పంపించడం వలన సమయం ఎక్కువగా తీసుకోవడం కోర్టులో నిరూపణ కష్టమయ్యేదని, ఈ రాపిట్ కిడ్స్ వల్ల వెంటనే గుర్తించడానికి, సీజ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడేది లేదని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే పౌర సరఫరాల విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నారన్నారు. కాకినాడ పోర్ట్ లో గతంలో జరిగిన అక్రమ రవాణా జరిపిన వారిపై చట్ట పరమైన చర్యలు,వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు.,మన దేశానికి సంబంధించిన పీడీఎస్ రైస్ మన పోర్టు ల నుండి అక్రమ రవాణా జరగ కూడదని ,చెక్ పోస్టు లు ఏర్పాటు చేశామని,ఈ విధానం కాకినాడలో విజయవంతంగా అమలు చేశామన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల 42 లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు అందించడం జరిగిందని, 89% మంది వీటి ద్వారా రైస్ తీసుకుంటున్నారని తెలుస్తుందన్నారు. వినియోగదారులకు బియ్యం సంబంధించిన సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
రాష్ట్రంలోని 29,752 చౌక ధర దుకాణాలలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 5 లక్షల 35 వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుంటే, ఈ ప్రభుత్వం గత 14 నెలలో 245 కోట్ల విలువైన 5 లక్షల 65 వేల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 230 క్రిమినల్ కేసులు పెట్టామని, కోర్టులలో విచారణ జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో కూడా అలాంటి బియ్యం అక్రమ రవాణా జరగకుండా కంటైనర్ పోర్టు సందర్శించి సమావేశాలు నిర్వహించి హెచ్చరించడం జరిగిందన్నారు. న్యాయంగా, సక్రమంగా జరిపే వ్యాపారానికి ఆటంకాలు కలుగకుండా సహకరిస్తామని అప్పుడే తెలిపామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తామని కఠినంగా కూడా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
పోర్టిఫైడ్ బియ్యం లో పోషక విలువలు ఉంటాయి – సౌరబ్ గౌర్
రాపిడ్ కిట్ తో పిడిఎఫ్ బియ్యం గుర్తించే విధానాన్ని కమిషనర్ సౌరబ్ గౌర్ విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టిఫైడ్ రైస్ అంటే 100 కేజీల బియ్యం లో ఒక కేజీ మల్టీ విటమిన్ మిక్స్, ఐరన్ తో కూడిన రైస్ కలుపుతారని, వీటి పై ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ ఉన్నదని, నిజానికి బియ్యాన్ని పిండి చేసి దానిలో దాన్లో మల్టీ విటమిన్ మిక్స్ కలుపుతార న్నారు. ఇది సాధారణ బియ్యం కంటే పోషక విలువలు కలిగిన ఆహారం అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండి మన్జీర్ జిలాని, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీలత, జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
The post Minister Nadendla Manohar: అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్టకు మూడు చెక్ పోస్టులు – నాదెండ్ల మనోహర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Nadendla Manohar: అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్టకు మూడు చెక్ పోస్టులు – నాదెండ్ల మనోహర్
Categories: