చనిపోయిన వారిని భూమిలో పూడ్చడం లేదా దహనం చేయడం ప్రపంచమంతా పాటించే సంప్రదాయం. కానీ ఇండోనేషియాలోని ఒక తెగ మాత్రం ఈ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్లో ఉన్న తొరాజా జాతి ప్రజలు చనిపోయిన వారిని తమ ఇంట్లోనే ఉంచుతారు, వారి మధ్యే జీవిస్తారు. ఈ విచిత్ర సంస్కృతి బయటివారికి వింతగా అనిపించినా, తమ దృష్టిలో మరణం అనేది ఒక గొప్ప ప్రయాణంలో మరో అడుగు మాత్రమే అని వీరు నమ్ముతారు. అందుకే, ఇక్కడ చనిపోయినవారిని ‘జీవించి ఉన్న మృతదేహాలు’గా పిలుస్తారు.
తొరాజా ప్రజల సంస్కృతిలో అంత్యక్రియల (ఫ్యూనరల్) ఖర్చు చాలా ఎక్కువ. అంత్యక్రియలు పూర్తి చేయడానికి అవసరమైన డబ్బును, ఇతర వనరులను సమకూర్చుకోవడానికి కొందరికి సంవత్సరాలు పడుతుంది. అంతవరకు, చనిపోయినవారి మృతదేహాలను మమ్మీకరణ (Mummified) చేసి, తొంగ్కోనన్ అనే ప్రత్యేక గదులలో ఇంట్లోనే భద్రపరుస్తారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చు దాదాపు $500,000 (సుమారు రూ. 4.15 కోట్లు) వరకు ఉంటుందని ట్రావెల్ బ్లాగర్లు చెబుతున్నారు.
తొరాజా కమ్యూనిటీలో అంత్యక్రియలు అంటే దుఃఖించే సమయం కాదు, అదొక ఉత్సవం. ఈ వేడుక ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా వందలాది మంది అతిథులకు భోజనం పెట్టాలి, పెద్ద సంఖ్యలో గేదెలు, పందులను బలి ఇవ్వాలి. చనిపోయినవారి కోసం కొత్త గుడిసె కట్టి, దాన్ని అంత్యక్రియల్లో తగలబెట్టాలి. మృతదేహాన్ని పూడ్చే ఖర్చు, అంతవరకు మమ్మీని జాగ్రత్తగా చూసుకునే ఖర్చు దీనికి అదనం.
ఈ ఖర్చును తగ్గించుకోవడానికి లేదా మరో కుటుంబ సభ్యుడు చనిపోయే వరకు వేచి చూడటానికి కూడా కొందరు మృతదేహాలను భద్రపరుస్తారు. ఎవరైనా భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే, రెండో భాగస్వామి ‘పుయా’ (మరణానంతర ప్రయాణం) లో జాయిన్ అయ్యే వరకు, చనిపోయినవారి మృతదేహాన్ని భద్రంగా ఉంచుతారు. ఈ తెగ ప్రజలు తమ పూర్వీకుల మృతదేహాలతోనే జీవిస్తారు. చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ‘మనెనె’ అనే ప్రత్యేక ఆచారం పాటిస్తారు.
ఇందులో భాగంగా, మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి, శుభ్రం చేసి, కొత్త దుస్తులు తొడుగుతారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని కొత్తగా కలిసిన వారికి, చిన్న పిల్లలకు వారిని పరిచయం చేస్తారు. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల వరకు కొనసాగుతుంది. తొరాజా రీజియన్ పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, అక్కడికి వెళ్లే టూరిస్టులు కేవలం ఫోటోల కోసం కాకుండా, ఈ విచిత్రమైన మరణ సంస్కృతిని ప్రత్యక్షంగా చూడటానికి వెళ్తారు.