ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసుతో సహా పలు కేసుల్లో వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ను 11 రోజుల ఎన్ఐఏ (NIA) కస్టడీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్కోర్టు బుధవారంనాడు అప్పగించింది. అన్మోల్ను అమెరికా డిపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి భారత్కు తరలించారు. అన్మోల్ను తీసుకువచ్చిన విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచింది.
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్లో అన్మోల్ పాత్రను ఎన్ఐఏ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించారు. ఈ నెట్వర్క్లో అన్మోల్ కీలక సభ్యుడని, 2022 నుంచి పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ నడుపుతున్న టెర్రర్ గ్యాంగ్స్టర్ సిండికేట్లో అరెస్టయిన 19వ నిందితుడని తెలిపారు. ట్రెర్రర్ గ్రూప్ ఆపరేషన్లకు అందుతున్న నిధులు, ఇతర సభ్యులను గుర్తించడం సహా విస్తృత స్థాయి సమాచారం వెలికితీసేందుకు అన్మోల్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కాగా, అన్మోల్పై రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలో 31 కేసులు నమోదయ్యాయి. ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ సంప్రదింపుల సాగించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూమూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఆయనపై రూ.10 లక్షల రివార్డును కూడా ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో అన్మోల్ పట్టుబట్టాడు. ఈనెల 18న అతనిని యూఎస్ బహిష్కరించింది.
The post Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్
Categories: