తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనదని.. పర్యావరణ సంపదతో పాటు, సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం ఈశాన్య ప్రాంతమని సీఎం చెప్పారు.
‘ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాల పౌరుల బాధను మన తెలుగు ప్రజలం సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1970లు , 80లలో ఉత్తరాది వారు మన దక్షిణాది వాళ్లందరినీ ‘మద్రాసీలు’ అని పిలిచేవారు. తెలుగువారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు, సంస్కృతం మధ్య తేడాను వివరించడం దక్షిణాది వారికి కష్టంగా ఉండేది. అయినా ఎకానమీ పరంగా, సాంస్కృతిక పరంగా, ఇతర రంగాల్లో దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి సంస్కృతిని మరింత బాగా అర్థం చేసుకోవాలి. వారితో కనెక్టివిటీ పెంచుకోవాలి. అప్పుడే ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాలలో మన దేశానికి మరింతగా తోడ్పాటు అందించే రాష్ట్రాలుగా మారతాయి.’ అని సీఎం చెప్పారు.
హైదరాబాద్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న ముఖ్యమంత్రి… సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్లు, క్రీడలు వంటి అన్ని రంగాలలో వారు సక్సెస్ అయ్యారని తెలిపారు. ‘తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ నా ధన్యవాదాలు. భారతదేశంలో తెలంగాణ మీకు మరో ఇల్లు లాంటిది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భారత్ ఫ్యూచర్ సిటీలో, భారతదేశపు మొట్టమొదటి ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటిస్తున్నాం. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తాం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు వారి వారి ప్రత్యేక భవనంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆహారం, చేతివృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలు ఉంటాయి. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కు కల్చరల్ కనెక్ట్ ఈ వేదికగా మొదలైంది.’ అని సీఎం తెలిపారు.
తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి.. త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్నారని వెల్లడించారు. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని సీఎం కాంక్షించారు. ‘ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళదాం.. తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లడానికి మీ సహకారం ఉండాలి’ అని సీఎం ఆకాంక్షించారు.
The post CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్
Categories: