ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవాసులు సైతం తాము భారతదేశ పౌరులమని మళ్లీ నిరూపించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందన్నారు. అలాంటి భారాన్ని ఎన్నికల సంఘం తమపై మోపిందని, ఇందుకు కేంద్రంలోని పాలకులు కారణమని ఆరోపించారు. తమిళనాడులో నిజమైన ఓటరు ఒక్కరూ ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కేరళలోని ప్రతిపక్షం పోరాడిందన్నారు. తమిళనాడులో ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మాత్రం పార్టీని దిల్లీలో తాకట్టు పెట్టి వారి నిబంధనల మేరకు సర్కు మద్దతు ఇస్తోందన్నారు.
‘సర్’ ఫారాలను డీఎంకే శ్రేణులు పూరించడం తప్పా – మంత్రి కేఎన్ నెహ్రూ
తెలియని వారికి ఎస్ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో, తిరుచ్చి ముక్కొంబు కావేరి, కొళ్లిడం చెరువుల్లో శుక్రవారం సుమారు 4లక్షల చేపపిల్లలను విడిచే కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అప్పావుతో కలిసి మంత్రి కేఎన్ నెహ్రూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిచ్చారు. సర్ను డీఎంకే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఎస్ఐఆర్ ఫారాలను రాష్ట్రంలోని పలు ప్రాంతంలో డీఎంకే కార్యకర్తలు పూర్తిచేయడంపై సమాధానమిస్తూ తెలియని వారికి ఎస్ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్ గత నాలుగున్నరేళ్లుగా డీఎంకే ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరిశీలించాలని, అలా చేయకుం డా ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా మాట్లాడడం సరికాదన్నారు.
ఐదు కోట్ల ఎస్ఐఆర్ ఫారాల వినియోగం
రాష్ట్రంలో 5 కోట్లకు పైగా ఎస్ఐఆర్ ఫారాలను వినియోగించినట్లు ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో గత నెల 27 వరకు సుమారు 6,41,14,587 మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు 5,00,67,045 (78.09శాతం) ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేసినట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 68,467 పోలింగ్ బూత్ల అధికారులు, 2,11,445 మంది బీఎల్వోలు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)పనుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది.
The post CM Stalin: ఎస్ఐఆర్ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్ ఆగ్రహాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Stalin: ఎస్ఐఆర్ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్ ఆగ్రహాం
Categories: