ఇటీవల బెంగళూరు నగర రహదారులు, చెత్తపై తీవ్ర విమర్శలు చేసిన బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. కిరణ్ మజుందార్ కు మద్దతుగా పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు. దీనితో కిరణ్ మజుందార్ ను ఉద్దేశ్యించి… సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమదైన శైలిలో వ్యంగాస్ట్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కిరణ్ మజుందార్ షా మంగళవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరినీ వేర్వేరుగా కలిసిన ఆమె తన మేనల్లుడి వివాహానికి ఆహ్వానించారు. దీనితోపాటు బెంగళూరు నగరాభివృద్ధి, బ్రాండ్ బెంగళూరు ప్రాజెక్టులపై చర్చించారు. నగర సదుపాయాల మెరుగుదల కోసం తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీనిచ్చారు.
ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్… బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు.
నకిలీ ‘వరల్డ్ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు ?
తమ ప్రభుత్వం చేపట్టిన పథకానికి ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నుంచి సర్టిఫికెట్ అందిందని గొప్పగా ప్రకటించిన కర్ణాటక సీఎం ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలిన దరిమిలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల.. రాష్ట్రంలోని మహిళలకు ‘శక్తి యోజన’పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించామని, ఈ నేపధ్యంలో మహిళలు అత్యధికంగా ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. దీనిని ప్రపంచ రికార్డుగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించిందని ప్రకటించారు. కర్ణాటక రెండు చరిత్రాత్మక రికార్డులతో ప్రపంచ వేదికపైకి ప్రవేశించిందని పేర్కొన్నారు.
‘శక్తి యోజన’ పథకం కింద మహిళలు మొత్తంగా 564.10 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఇది మహిళల రోజువారీ ప్రయాణాలలో కొత్త రికార్డు అని సిద్దరామయ్య తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. దీనికితోడు కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ 1997 నుంచి ఇప్పటివరకూ 464 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందని చెబుతూ, రెండు సర్టిఫికెట్ల ఫొటో కాపీలను షేర్ చేశారు.ఈ రెండు సర్టిఫికెట్లపై లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్(ఇండియా)డాక్టర్ అవినాష్ డి. సకుండే, యూరోపియన్ యూనియన్ హెడ్(క్రొయేషియా)డాక్టర్ ఇవాన్ గచినాల సంతకాలున్నాయి.
ఈ సర్టిఫికెట్లను గమనించిన ప్రతిపక్ష పార్టీలు ఇది కేవలం ప్రచార స్టంట్ అని ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలకు అధికంగా ఖర్చు చేస్తోందని, రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు మొత్తం రూ.6,330 కోట్ల అప్పును కలిగి ఉన్నాయని, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. కాగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ బ్రిటన్లో నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ అధికారికంగా 2025, జూలై 15న మూతపడింది. అవినాష్ ధనంజయ్ సకుండే 2024, జూన్ 28న ఈ సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు మనుగడలో లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు చెల్లనివని నిరూపితమయ్యాయి. బీజేపీ నేత అమిత్ మాలవియ కర్నాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు ఫేర్ అంటూ ఆధారాలతో సహా షేర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు సీఎం సిద్దరామయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
The post Kiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్ మజుందార్ షా భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Kiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్ మజుందార్ షా భేటీ
Categories: