ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత గ్రౌండ్ ఏకానా స్టేడియంలో టాస్ గెలిచి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం ఉన్నా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకోవడం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో 40 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం లక్నో జట్టులోని గందరగోళాన్ని బయటపెట్టింది.
ముఖ్యంగా ఈ సీజన్లో ఏకానాలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోవడం లక్నో హోమ్ రికార్డును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ఓటమికి ప్రధాన కారణం ఐపీఎల్ అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. ఏకంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పంత్, కష్ట సమయంలో జట్టును ఆదుకోవాల్సింది పోయి మూడు బంతులాడి డకౌట్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
160 పరుగుల మామూలు టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్, చెత్త షాట్తో పెవిలియన్ చేరడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. కేవలం బ్యాటింగ్లోనే కాదు, పంత్ బౌలింగ్ సెలెక్షన్స్ కూడా బెడిసికొట్టాయి.
రాజస్థాన్ ఇన్నింగ్స్ మొదట్లో మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 140 లోపే కట్టడి చేసేలా కనిపించారు. కానీ చివర్లో పంత్ చేసిన బౌలింగ్ మార్పుల వల్ల రాజస్థాన్ 159 పరుగులకు చేరుకుంది. రవీంద్ర జడేజా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
లక్ష్యం చిన్నదే అయినా లక్నో బ్యాటర్లు ఏమాత్రం ఫైట్ ఇవ్వలేదు. పంత్, మార్క్రమ్, బడోని వంటి స్టార్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమై డక్లతో క్యూ కట్టారు. కేవలం మిచెల్ మార్ష్ మాత్రమే 55(41) ఒంటరి పోరాటం చేశాడు. మరో ఖరీదైన ఆటగాడు పూరన్ కూడా వరుసగా చేతులైతేసి జట్టుకు భారంగా మారుతున్నాడు. గతంలో లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలో ఆటగాళ్ల తీరుపై కోప్పడే వీడియోలు వైరల్ అయినప్పుడు చాలామంది ఆయనను విమర్శించారు.
కానీ ఇప్పుడున్న లక్నో టీమ్ ఆటతీరు చూస్తుంటే, ఆయన కోప్పడడంలో తప్పు లేదని స్వయంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 27 కోట్ల భారీ ధర పలుకుతున్న కెప్టెన్ ఇలాగేనా ఆడేది అంటూ నెటిజన్లు గోయెంకాకు మద్దతుగా నిలుస్తున్నారు. సొంత గ్రౌండ్లో కనీసం 160 టార్గెట్ను కూడా చేజ్ చేయలేకపోతే ఇక 200 పరుగుల లక్ష్యాలు ఉంటే టీమ్ పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద ప్రశ్న.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్లు పవర్ప్లేలోనే లక్నోను 16/3కి పడేసి మ్యాచ్ను వన్ సైడ్ చేసేశారు. మిచెల్ మార్ష్ ఒక్కడే పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి కనీస సహకారం అందలేదు. మరి ఇప్పటికైనా పంత్ తన ఆటతీరును మార్చుకుని జట్టును గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.