తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా… ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయని విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్య అభ్యంతరం తెలిపారు. తన నుంచి వసూలు చేసిన అసలు, వడ్డీలకు మరోసారి కొత్తగా వడ్డీ విధిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలుచేశారు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో తాను, తన కంపెనీ తీసుకున్న రుణాల్లో బకాయిల వివరాలను బ్యాంకులు విడుదల చేయాలని ఆదేశించాలని కోరుతూ ఈ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యం జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చింది. తన నుంచి రూ.10 వేల కోట్లు వసూలు చేశామని రుణ వసూలు ట్రైబ్యునల్ నివేదిక ఇవ్వగా, కేంద్ర ఆర్థికమంత్రి మాత్రం రూ.14 వేల కోట్లు వసూలు చేశామని లోక్సభలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. చెల్లించిన రుణానికి కూడా మళ్లీ వడ్డీ వేస్తున్నట్లు ఉందని మాల్య తరఫు న్యాయవాది వాదించారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అమెరికాలో హైర్ చట్టంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది – జైరాం రమేశ్
తమ దేశంలో ఔట్సోర్సింగ్ విదేశీయులపై 25% పన్ను విధించాలని అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) చట్టంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘బ్లూకాలర్ ఉద్యోగాలు చైనాకు తరలిన నేపథ్యంలో.. వైట్కాలర్ ఉద్యోగులు భారత్కు వెళ్లిపోకూడదనే ఈ బిల్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అక్టోబరు 6న సెనెటర్ బెర్నీ మోరెనో ప్రవేశపెట్టిన హైర్ బిల్లు సెనెట్ కమిటీ ఆన్ ఫైనాన్స్కు పంపింది. దీని ప్రకారం, అమెరికాలో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులు తమ మొత్తం జీతంలో 25% అక్కడి ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లు భారత ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ), కన్సల్టింగ్, జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాలు దీనికి ప్రభావితమవుతున్నాయి. కానీ అధిక తీవ్రత మన దేశంపైనే ఉంటుంది’’ అని జైరాం పేర్కొన్నారు.
హిందూ దేవాలయానికి ముస్లిం వ్యాపారి కోటి రూపాయల విరాళం
హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘటన ఇది. కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ జిల్లా చెన్నపట్టణ మంగళవారపేటలో శ్రీబసవేశ్వర స్వామి ఆలయం ఉంది. దీని జీర్ణోద్ధరణ పనులకు ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఉల్లా సఖాఫ్ రూ.కోటి విరాళం ఇచ్చారు. పూర్తిగా తన సొంత ఖర్చుతో పనులన్నీ చేయించారు. మూడు రోజుల క్రితం ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ ఆలయ విస్తరణకు వీలుగా స్థానికులైన కెంపమ్మ, మోటేగౌడ తమ స్థలం కేటాయించారు. సయ్యద్ ఉల్లా సఖాఫ్ గతంలోనూ మోగేనహళ్లి గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. మనం చేసే మంచి పనులతోనే తదుపరి తరాలు బాగుంటాయని, తాను ఈ ఒక్క సిద్ధాంతాన్నే నమ్ముతానని సఖాఫ్ తెలిపారు.
The post Vijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్ మాల్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Vijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్ మాల్య
Categories: