విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు న్యూ ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.
విజయవాడ నగర శివారు న్యూ ఆటోనగర్లో పోలీసులకు చిక్కిన 28 మందిలో మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక సభ్యులు ఉన్నట్లు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) అధికారులు గుర్తించారు. వారిలో.. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జికి రక్షణగా ఉన్న 9 మంది సుశిక్షితులైన కమాండోలు ఉన్నారని అధికారులు కనుగొన్నారు. దేవ్ జికి రక్షణ దళం కమాండర్ జ్యోతి సైతం విజయవాడ షెల్టర్ జోన్లో దొరికిన వారిలో ఒకరిని అధికారులు వెల్లడించారు. మిగతా 19 మంది.. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు రక్షణగా ఉన్న ఫ్లటూన్ సభ్యులని ఎస్ఐబీ అధికారులు వెల్లడించారు. వీరంతా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ వారని పేర్కొన్నారు. వీరికి గోండు భాషతో పాటు కొంతమందికి కొద్దిగా హిందీ తెలుసునని అధికారులు వివరించారు. దీంతో విచారణకు కొంత ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. గోండు భాషతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో మాట్లాడే భాష తెలిసి వారితో తెలుగులోకి అనువదించే వారి కోసం పోలీస్ అధికారులు అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తొలుత వీరు తమకేమీ తెలియదని ఎస్ఐబీ అధికారులకు చెప్పారని సమాచారం. ఆ తర్వాత కొన్ని విషయాలును స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక న్యూ ఆటోనగర్లోని ఆటో మొబైల్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్కు చెందిన వారు ఉన్నారు. దాంతో వీరంతా.. వారితో కలిసిపోయి పని చేస్తున్నట్లు ఎస్ఐబీ అధికారుల విచారణలో చెప్పినట్లు సమాచారం.
భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామంటూ, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటెలిజెన్స్-ఆక్టోపస్ బృందాల జాయింట్ ఆపరేషన్ – ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
విజయవాడ ఆటోనగర్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కచ్చితమైన సమాచారంతో సోదాలు చేశామన్నారు. విజయవాడతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించామని, మావోయిస్టులకు సంబంధించి 5 జిల్లాల్లో ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
‘‘ఆటోనగర్లోని కానూరులో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. వారందర్నీ అదుపులోకి తీసుకున్నాం. పట్టుబడిన వారిలో ఎక్కువమంది ఛత్తీస్గఢ్కు చెందినవారున్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నాం. పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారం రేపు చెబుతాం’’అని అన్నారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో జరిగిన సోదాల్లో ఇప్పటి వరకు మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏలూరులో 15 మంది మావోయిస్టులు అరెస్ట్ ?
ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. వాటి ఆధారంగా పలు జిల్లాలో గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్సిటీలో తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నారు.
ఏలూరులో ఎంత కాలంగా ఉంటున్నారు? ఈ ప్రాంతాన్నే షెల్టర్ జోన్గా ఎందుకు ఎంచుకున్నారు? ఏలూరు జిల్లా పరిధిలో ఇంకా ఎంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవన యజమాని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడలో 32 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, ఏలూరు, కాకినాడ నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో పోలీస్, గ్రేహౌండ్స్ బృందాలు జల్లెడ పడుతున్నాయి.
The post Vijayawada: విజయవాడలో 27 మంది మావోయిస్టులు అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Vijayawada: విజయవాడలో 27 మంది మావోయిస్టులు అరెస్ట్
Categories: