hyderabadupdates.com movies అప్పుడు పరశురామ్.. ఇప్పుడు ప్రశాంత్

అప్పుడు పరశురామ్.. ఇప్పుడు ప్రశాంత్

‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రశాంత్.. ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచే కాక పలువురు ప్రొడ్యూసర్ల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్నాడని.. ఆ డబ్బులతో హైదరాబాద్ శివార్లలో భారీ ఆఫీస్ కమ్ స్టూడియో కట్టుకున్నాడని.. ‘హనుమాన్’ రిలీజై రెండేళ్లు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయాడన్నది అతడి మీద ఆరోపణ.

ప్రశాంత్‌కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు.. తమకు ఇచ్చిన కమిట్మెంట్‌ను అతను ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియక తలలు పట్టుకుంటున్నారని.. అందరూ కలిసి ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదులు చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. నిరంజన్ రెడ్డి నిజంగానే రంగంలోకి దిగి కంప్లైంట్ ఇచ్చేశారు. ఆయన ప్రశాంత్ మీద తీవ్ర ఆరోపణలే చేశారు. ప్రశాంత్ కూడా తన వాదన ఏదో వినిపించినట్లు తెలుస్తోంది.

ఐతే ఈ వ్యవహారంలో ఏ ఒక్కరినో తప్పుబట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఒక దర్శకుడు పెద్ద హిట్ ఇవ్వగానే నిర్మాతలు ఎగబడి అడ్వాన్సులు ఇచ్చేయడం.. ఆ దర్శకుడు సినిమా ఎప్పుడు, ఎలా అనే క్లారిటీ ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి అడ్వాన్సులు ముట్టజెప్పేయడం ఎప్పట్నుంచో ఉన్న ప్రాక్టీసే. అదే సమయంలో దర్శకులకు కూడా ఎప్పుడు ఏ సినిమా చేయాలో క్లారిటీ ఉండదు. కానీ అడ్వాన్సులు మాత్రం తీసేసుకుంటారు. ఆ డబ్బులన్నీ కలిపి పెట్టుబడులు పెట్టేస్తారు. హీరోల విషయంలోనూ ఇది జరుగుతుంటుంది.

ఐతే ప్రశాంత్ మరీ పరిమితికి మించి అడ్వాన్సులు తీసుకుని.. ఎవరికీ క్లారిటీ ఇవ్వకుండా ఆ డబ్బులను సొంత లాభానికి వాడుకున్నాడన్నది ఆరోపణ. ఇంతకుముందు పరశురామ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘గీత గోవిందం’ పెద్ద హిట్టవ్వగానే అరడజను మందికి పైగా నిర్మాతలు అతడి వెంట పడ్డారు. ఎవరికీ నో చెప్పకుండా అందరి దగ్గరా అడ్వాన్సులు తీసుకునేశాడు. కానీ తర్వాత తన ప్రాజెక్టులు అటు ఇటు మారుతూ గందరగోళం నెలకొంది. తమకు కమిట్మెంట్ ఇచ్చిన టైంలోనే విజయ్‌ని హీరోగా పెట్టి దిల్ రాజుతో ‘ఫ్యామిటీ స్టార్’ తీయడంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు బాగా కోపం వచ్చింది.

మరోవైపు నాగచైతన్యతో అతను సినిమా విషయంలోనూ గందరగోళం నెలకొంది. మధ్యలో ‘సర్కారు వారి పాట’కు వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. మొత్తంగా తన కమిట్మెంట్ల విషయంలో అతను ఉక్కిరబిక్కిరి అయ్యాడు. ‘సర్కారు వారి పాట’ నిరాశపరచడం.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ కావడంతో ఇప్పుడసలు పరశురామ్‌కు డిమాండే లేదు. ఇంకా కొందరు నిర్మాతల అడ్వాన్సులు తన దగ్గర అలాగే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పది మందికి పైగానే నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడని.. కానీ సినిమాలు ప్రకటించడమే తప్ప, ఏదీ ముందుకు కదలకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొని వ్యవహారం ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Related Post