జనసేన పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. వారివారి నియోజకవర్గాల్లో సంగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ తమ నియోజకవర్గా ల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు వివరించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని… కొందరు చెబితే.. మరికొందరు తమ సమస్యలు వెల్లడించారు. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఇదీ.. బయటకు వచ్చిన వార్త. అయితే.. తెరవెనుక మరో రీజన్ కూడా ఉంది.
కూటమిని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత.. ఎమ్మెల్యేలు కలివిడిగా ఉండని నియోజకవర్గాలు.. ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారుతున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే తొలుత ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచారు. ఇది వాస్తవం. కూటమిగా ముందుకు సాగాలని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఆ పనిని చేయలేక పోతున్నారు. దీనిని పరిష్కరించేందుకు పవన్ ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా మూడు కీలక విషయాలను 9 మంది ఎమ్మెల్యేలు కామన్గా చెప్పినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాటి పరిష్కారం తమ చేతుల్లో లేదని కూడా ఒకరిద్దరు చెప్పినట్టు తెలిసింది. ఆయా సమస్యలను అధిష్టానమే పరిష్కరించాలని కూడా తేల్చి చెప్పారు. 1) నియోజకవర్గాల్లో పెత్తనం: గత ఎన్నికల్లో టీడీపీ నేతలు త్యాగం చేసిన నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం లేదని.. లోకం మాధవి(నెల్లి మర్ల), మండలి బుద్ధప్రసాద్(అవనిగడ్డ), సుందరపు విజయకుమార్(ఎలమంచిలి) చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
2) కార్యక్రమాల గురించి తెలియడం లేదు: కార్యక్రమాలు నిర్వహించేందుకు తాము కలిసి ముందుకు సాగేందుకు ఇబ్బంది లేదని అందరూ చెప్పారు. కానీ.. ఆయా కార్యక్రమాలు నిర్వహించే సమయం కానీ, షెడ్యూల్ కానీ.. తమకు తెలియడం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు చెప్పారు.
3) పనులు జరగడం లేదు: తాము చెప్పిన పనులు అధికారులు చేయడం లేదని అందరూ చెప్పారు. ఇలా.. ఈ మూడు సమస్యలు ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారాయన్నది వారు చెప్పిన మాట. వీటిని పరిష్కరించాలని కోరారు. దీంతో పాటు కీలకమైన నిధుల సమస్యలను వారు ప్రస్తావించారు. ఇదీ.. ఇతమిత్థంగా జనసేన అధినేతకు ఎమ్మెల్యేలు చెప్పిన మాట.