ఖైదీ, విక్రమ్ సినిమాలతో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్కు మామూలు హైప్ రాలేదు. ఇంత తక్కువ టైంలో మరే దర్శకుడికీ రాని స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు లోకేష్. కానీ తన తర్వాతి రెండు చిత్రాలు అతడి గాలి తీసేశాయి. లియో, కూలీ చిత్రాలకు వచ్చిన హైప్ ఎలాంటిదో.. చివరికి అవి బాక్సాఫీస్ దగ్గర ఎలా తుస్సుమన్నాయో తెలిసిందే. ప్రి రిలీజ్ హైప్ వల్ల వాటికి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. లేదంటే పెద్ద డిజాస్టర్లుగా నిలవాల్సింది.
‘కూలీ’ చిత్రానికి లోకేష్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషకం తీసుకోవడం విశేషం. ఆ విషయాన్ని అతనే స్వయంగా అంగీకరించాడు. ఆ సినిమాకు వచ్చిన హైప్ ప్రకారం చూస్తే అది మరీ పెద్ద విషయం కాదు. కానీ తాను హీరోగా అరంగేట్రం చేస్తున్న ‘డీసీ’ మూవీకి లోకేష్ ఏకంగా రూ.35 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తుండమే షాకింగ్.
సాని కాయితం, కెప్టెన్ మిల్లర్ చిత్రాలను రూపొందించిన అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్టులో కూడా లోకేష్ భాగస్వామి అయ్యాడు. ‘కూలీ’ రిలీజ్కు ముందే ఈ ప్రాజెక్టు ఓకే అయింది. లోకేష్కు వ్యక్తిగతంగా యూత్లో వచ్చిన క్రేజ్కు తోడు స్క్రిప్టులో తన భాగస్వామ్యం ఉండడం.. అంతే కాక ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలను కూడా స్వయంగా డీల్ చేయడంతో నిర్మాణ సంస్థ ఏకంగా రూ.35 కోట్ల పారితోషకం ఇవ్వడానికి ఒప్పుకుందట.
కానీ ‘కూలీ’ ఫ్లాప్ అయ్యాక లోకేష్ ఇమేజ్ బాగా దెబ్బ తిన్న మాట వాస్తవం. దర్శకుడిగా అతడికి ఉన్న క్రేజే కొంచెం తగ్గింది. మరి హీరోగా తన కోసం యూత్ ఎగబడతారా అన్నది ప్రశ్న. అలాంటపుడు కేవలం అతడి పారితోషకమే రూ.35 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టును వర్కవుట్ చేయడం చాలా కష్టమవుతుంది. మరి నిర్మాతల ధైర్యమేంటో చూడాలి. వామికా గబ్బి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.