hyderabadupdates.com movies ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా విప్లవాన్ని తెచ్చేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఆయన ఒక భారీ ప్రకటన చేశారు. రాబోయే ఏడేళ్లలో ఏఐ రంగంలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం వ్యాపారం కోసం చేస్తున్న పెట్టుబడి కాదు, దేశ నిర్మాణానికి ఉపయోగపడే పెట్టుబడి అని స్పష్టం చేశారు.

ఒకప్పుడు డేటా అంటే చాలా ఖరీదైన వ్యవహారం. కానీ జియో ఎంట్రీతో అది ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏఐని కూడా అంతకంటే తక్కువ ధరకే ప్రతి పౌరుడికి, ప్రతి రంగానికి చేరవేస్తామని అంబానీ హామీ ఇచ్చారు. “భారతదేశం ఇంటెలిజెన్స్‌ను అద్దెకు తెచ్చుకోకూడదు, మనకు సొంత మౌలిక సదుపాయాలు ఉండాలి” అని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. డేటా రేట్లను తగ్గించినట్లే, ఏఐ సేవలను కూడా అందరికీ అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ లక్ష్యం కోసం అంబానీ మూడు కీలక అడుగులు వేస్తున్నారు. మొదటగా జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందులో 120 మెగావాట్ల సామర్థ్యం ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానుంది. దీనివల్ల డేటా ప్రాసెసింగ్ వేగం పెరగడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, కచ్‌ ప్రాంతాల్లో రిలయన్స్‌కు ఉన్న గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఈ డేటా సెంటర్లకు పర్యావరణ హితమైన విద్యుత్తును అందించబోతున్నారు.

జియోకు ప్రస్తుతం ఉన్న 50 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్ల బేస్ అంబానీకి అతిపెద్ద బలం. 4G, 5G నెట్‌వర్క్‌లను దేశవ్యాప్తంగా ఎలాగైతే విస్తరించారో, ఇప్పుడు అదే నెట్‌వర్క్ ద్వారా ఏఐ సేవలను నేరుగా ప్రజల దగ్గరకు చేర్చాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ‘ఎడ్జ్ కంప్యూటింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు.

అంటే మనం నివసించే లేదా పనిచేసే ప్రాంతాలకు దగ్గరగానే ఏఐ ప్రాసెసింగ్ జరుగుతుంది, దీనివల్ల ఏఐ అప్లికేషన్లు చాలా వేగంగా (లో లేటెన్సీ) పనిచేస్తాయి. ఇంటర్నెట్ శకం నుంచి ఇంటెలిజెన్స్ శకం వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు 4G తెచ్చిన మార్పు కంటే ఏఐ తెచ్చే మార్పు చాలా ఎక్కువగా ఉంటుందని అంబానీ నమ్ముతున్నారు. మరి 10 లక్షల కోట్ల పెట్టుబడితో జియో ఏఐ రంగంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి.

Related Post

Here is when Mana Shankara Varaprasad Garu’s ticket bookings will openHere is when Mana Shankara Varaprasad Garu’s ticket bookings will open

Mana Shankara Varaprasad Garu, headlined by Megastar Chiranjeevi, is slated for a grand release on January 12. The family entertainer, directed by Anil Ravipudi, will have paid premiere shows on