అమరావతి : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ నైపుణ్యాభివృద్దికి సంబంధించిన స్కాంలో ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నివేదిక సమర్పించింది. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏమీ లేదని పేర్కొంది. తనకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే స్కాం కేసులో ఆనాటి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో పవర్ లోకి వచ్చారు. ప్రస్తుతం తన రాష్ట్రంతో పాటు దేశంలో చక్రం తిప్పుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయుడు అరెస్టుకు దారితీసిన 2023లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన వాదనలకు ఈ పరిణామం విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఏపీఎస్ఎస్డీసీ సిమెన్స్ ప్రాజెక్ట్ నుండి నిధుల దుర్వినియోగంలో నాయుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈడీ విచారణలో ఈ కేసులో కీలకమైన నిధుల మళ్లింపుతో నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని తేలింది . నిధుల దుర్వినియోగంపై తన దర్యాప్తులో భాగంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ కార్యాలయం, మనీలాండరింగ్ నివారణ చట్టం 2002 కింద రూ. 23.54 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. సిమెన్స్ ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై మెస్సర్స్ డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,ఇతరులపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ జరిగింది.
The post ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబుకు క్లీన్ చిట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబుకు క్లీన్ చిట్
Categories: