ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం మేకర్స్ ఊహించని రేట్లు ఇచ్చి సినిమాలు కొన్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి కంటెంట్ క్రియేట్ చేశాయి. క్రమంగా ఇదొక పెద్ద మార్కెట్గా మారింది.
ఒక సినిమా బడ్జెట్ అంతా డిజిటల్ హక్కుల రూపంలోనే వచ్చేసే స్థాయికి ఈ మార్కెట్ విస్తరించడంలో నిర్మాతల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కొన్నేళ్లు తిరిగేసరికి మొత్తం మారిపోయింది. ఒకప్పట్లా ఓటీటీలో సినిమాలకు ఓపెన్ ఆఫర్లు ఇవ్వట్లేదు. ఎగబడి సినిమాలను కొనట్లేదు.
ఓటీటీ సంస్థలు పెట్టే పెట్టుబడికి తగినట్లు రిటర్న్స్ రాక.. వాళ్లూ బడ్జెట్లలో కోత పెట్టేశారు. సినిమాల కొనుగోలులో గీచి గీచి బేరం ఆడుతున్నారు. అనేక షరతులూ పెడుతున్నారు. దీంతో ఇప్పుడు డిజిటల్ హక్కులు అమ్ముకునే సినిమాల సంఖ్య తగ్గిపోతోంది. డిజిటల్ ఆదాయం మీద ఒక అంచనా వేసుకుని బడ్జెట్లు పెడుతున్న నిర్మాతలకు.. ఆ డీల్స్ పూర్తి కాకుండా సినిమాలను రిలీజ్ చేసుకోవడం కష్టమైపోతోంది. రాను రాను ఇది ఇండస్ట్రీలో ఒక సంక్షోభ పరిస్థితిని క్రియేట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ ఓటీటీ సంస్థలు కొన్ని పెద్ద సినిమాల వరకు మంచి ఆఫర్లు ఇచ్చి డిజిటల్ హక్కులు కొంటున్నాయి కానీ.. మిగతా చిత్రాలకు మాత్రం రకరకాల కండిషన్లు పెడుతున్నాయి. ఇప్పుడు నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న కండిషన్.. థియేట్రికల్ రిజల్ట్ను బట్టి రేటు ఉంటుందనడం.
థియేటర్లలో ఒక సినిమా ఎంత కలెక్షన్లు రాబడుతుందో.. అందులోంచి ఒక పర్సంటేజ్ అమౌంట్ ఇస్తామని ఓటీటీ సంస్థలు షరతులు విధిస్తున్నాయి. సినిమా బాగుందో లేదో తెలియకుండా తాము ఒక రేటు ఇవ్వలేమని.. సినిమా థియేటర్లలో బాగా ఆడి, కంటెంట్ ఉందని రుజువు చేసుకుంటే అందుకు తగ్గ రేటు ఇచ్చి సినిమా తీసుకుంటామని ఓటీటీలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు కొన్ని సినిమాల విషయంలో పే పర్ వ్యూ పద్ధతిని కూడా పాటిస్తున్నాయి. ఎంతమంది చూశారన్న దాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నాయి. దీంతో గతంలో పనికి రాని సినిమాలు తీసి కూడా డిజిటల్ హక్కులకు మంచి రేటు దక్కించుకుని సేఫ్ అయిపోయిన నిర్మాతలకు ఇప్పుడు ఈ షరతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. మరోవైపు ఓటీటీ సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ స్లాట్ ఆధారంగా సినిమాల రిలీజ్ డేట్లను కూడా నిర్దేశిస్తుండడం కూడా నిర్మాతలకు ఇబ్బందిగా తయారవుతోంది.