టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి వచ్చిన తుమ్మల.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా తన పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావడంతో తీరిక చేసుకుని మరీ ఆయనతో మాట్లాడారు.
బలమైన స్నేహం..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం నుంచి పలుమార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో తుమ్మల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. 2014లో టీడీపీని వీడి అప్పటి టీఆర్ ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత.. మంత్రి పీఠాన్ని కూడా దక్కించుకున్నారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ ఎస్ ఆయనను దూరం పెట్టింది. దీంతో గత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
చంద్రబాబుపై పన్నెత్తు విమర్శలు చేయని తుమ్మల.. రాజకీయంగా విభేదించినా.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు చేరువగానే ఉన్నారు. కాగా.. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తుమ్మల.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనకు నివేదిక ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు.
ఇవీ.. వినతులు!
పోలవరం ముంపు గ్రామాల్లోని 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలి.
తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి 5 ఎకరాల స్థలం కేటాయింపునకు సహకరించాలి.
ఖమ్మంలో నిర్మించనున్న తిరుమల అనుబంధ ఆలయానికి అనుమతులు ఇవ్వాలి.
ఖమ్మంలోని పెద్దవాగు రిపేర్లకు ఏపీ వాటా కింద సొమ్ములు ఇవ్వాలి.
ఏపీ సరిహద్దులో ఉన్న భద్రాచలం కరకట్టకు మరమ్మతులు చేయించాలి.
సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయాలి.