గ్లోబ్ ట్రాట్టింగ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు మోస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి తొలి కంటెంట్ ఇవాళ పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రూపంలో వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ది చికిరి చికిరి సాంగ్ వచ్చిన కొంత సేపటికే ఈ పోస్టర్ వదలడంతో రెండింటి మధ్య హోరాహోరి ట్రెండింగ్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ దానికి భిన్నంగా ఎక్కువ శాతం నెగటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కుంభగా విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్విరాజ్ లుక్ 24లో సూర్య చేసిన ఆత్రేయ క్యారెక్టర్ ని పోలి ఉండటమే దీనికి ప్రధాన కారణం. పైగా పోస్టర్ కూడా ఎగ్జైట్ మెంట్ కలిగించేలా లేదు.
ఈ మాత్రం దానికే రాజమౌళిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే అసలైన ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచాన్ని నవంబర్ 15 పరిచయం చేయబోతున్నారు. ఊరికే ట్రైల్ కోసమన్నట్టు ఈ లుక్ వదిలారు తప్పించి ఏదో అద్భుతాలు చేస్తుందని కాదు. కానీ మలయాళం ఫ్యాన్స్ అలా అనుకొలెదు. సలార్ మించిన పాత్రలో జక్కన్న తమ హీరోని విలన్ గా చూపిస్తాడని ఎదురు చూశారు. కానీ రాజమౌళికి ఇలాంటి టాక్స్ కొత్త కాదు. బాహుబలి మొదటి రోజు పోయిందనే మాట నుంచి ఆర్ఆర్ఆర్ ఆడదనే కామెంట్స్ దాకా ఎన్నో చూశారు. సో ఇప్పుడీ పోస్టర్ కి ఎలాంటి స్పందన వచ్చినా ఆయనకేం ఫరక్ పడదు.
రామోజీ ఫిలిం సిటీలో చేయబోయే వేడుకలో టీజర్ లాంచ్ ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అసలైన కిక్ ఇచ్చే మెటీరియల్ అందులో చూడొచ్చు. దానికి తగ్గట్టే రాజమౌళి ప్రిపరేషన్ కూడా ఉంటుంది. టైటిల్ గురించి కూడా మూవీ లవర్స్ చాలా సస్పెన్స్ తో ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ఇవాళ వచ్చిన పోస్టర్ కి డీ కోడింగ్స్ చేస్తున్నారు నెటిజెన్లు. కుంభ అంటే రామాయణంలో కుంభకర్ణుడి రిఫరెన్స్ అని, అంటే మహేష్ బాబు రాముడని కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఇలాంటి థియరీలు బోలెడు వస్తుంటాయి కానీ నిజమైన దాఖలాలు తక్కువే. ఆ మధ్య కూలికి ఇలాంటివి లెక్కలేనన్ని వండి పెడితే ఒక్కటి నిజం కాలేదు.