రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి గెలుపు గుర్రం ఎక్కడానికి మార్చుకోవాల్సిన విధానాలు వంటి కీలక అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తాజాగా అధికారులు, మంత్రులతో నిర్వహించిన పలు సమీక్షల్లో ఈ విషయాలను ఆరా తీశారు. గ్రాఫ్ ఇప్పుడున్నట్టుగా ఉంటే కుదరదని స్పష్టం చేశారు.
వాస్తవానికి గత పది నెలల్లో పలు మార్లు ప్రజల నాడిని తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు ఆరా తీశారు. అప్పట్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, తరువాత కొంత గ్రాఫ్ తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే వీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.
వ్యక్తిగత లబ్ధి ఆధారంగా వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజల ఓట్లను పొందడానికి ప్రయత్నించింది. కానీ అది ఫలించలేదు. ఈ అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయాల్లో కొద్దికొద్దిగా మార్పులు చేస్తూ ముందుకు సాగుతోంది. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధిని కలిపి ప్రజల సంతృప్తి పెరగేలా చర్యలు తీసుకుంటోంది. అయితే దీనిని మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా తాజాగా సీఎం చంద్రబాబు, మిగతా కార్యక్రమాల కంటే ప్రజలకు మరింత చేరువ కావాలని అధికారులకు సూచించారు. మంత్రులతో పాటు అధికారులు కూడా ప్రజలకు సమయం ఇవ్వాలని, వారి సంతృప్తి పెంపొందించే ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. వచ్చే రెండు మూడు నెలల్లో ప్రజల మధ్యకు వెళ్లి సంతృప్తి స్థాయిలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. దీనితో గ్రాఫ్పై పక్కా ప్రణాళికతో ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది.